బడ్జెట్ 2021-22.. కరోనా వ్యాక్సిన్ కోసం రూ.35వేల కోట్లు

బడ్జెట్ 2021-22.. కరోనా వ్యాక్సిన్ కోసం రూ.35వేల కోట్లు

Updated On : February 1, 2021 / 12:37 PM IST

35 thousand crores for corona vaccine in budget 2021: యావత్ దేశం ఎంతో ఆసక్తి కనబరుస్తున్న అంశం బడ్జెట్. అందరి కళ్లు బడ్జెట్ పైనే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు(ఫిబ్రవరి 1,2021) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ సమావేశం ప్రారంభం కాగానే విపక్షాలు సభలో నిరసనకు దిగాయి. స్పీకర్‌ ఓం బిర్లా వారించినప్పటికీ సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. వారి నినాదాల నడుమే నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం మొదలుపెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా మూడోసారి. కాగా, దేశ చరిత్రలో తొలిసారిగా పేపర్ లెస్(డిజిటల్) బడ్జెట్ ను సమర్పించారు. మేడిన్ ఇండియా ట్యాబ్‌లో చూసి బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభం.

కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. జనజీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ‘నెవర్‌ బిఫోర్‌’ బడ్జెట్‌ను ప్రకటించనున్నట్లు నిర్మల ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. కరోనాతో కుదేలైన వ్యవస్థలన్నీ 2021-22 బడ్జెట్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నాయి.

ఈ బడ్జెట్ లో కరోనా వ్యాక్సినేషన్ కోసం రూ.35వేల కోట్లు కేటాయించారు. భారత్‌తో పాటు మరో 100 దేశాలకు వ్యాక్సిన్‌ అందిస్తామని మంత్రి తెలిపారు. దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరల్‌ ల్యాబ్‌ల ఏర్పాటు చేస్తామన్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్రోత్సాహకాల్లో భాగంగా రూ.1.97 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఆత్మనిర్భర్‌ ఆరోగ్య పథకానికి రూ.2,23,846కోట్లు కేటాయించారు. అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థారణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

బడ్జెట్ 2021-22 హైలైట్స్:

* ఆరోగ్యం రంగంలో రూ.64,180 కోట్లతో ప్రత్యేక నిధి. దీనికి పీఎం ఆత్మనిర్భర్‌ భారత్‌ ఆరోగ్య పథకం.

* కొత్తగా 9 బీఎస్‌ఎల్‌-3 స్థాయి ప్రయోగశాలలు.

* ఇన్వెస్టర్ రక్షణ కోసం కొత్త ఇన్వెస్టర్ ఛార్టర్ ఏర్పాటు

* బీమా రంగంలో ఎఫ్‌డీఐలు 74 శాతానికి పెంపు

* 2023 నాటికి 100 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ

* 2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు

* రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు

* 2కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు

* జల జీవన్‌ మిషన్‌కు రూ.2,87,000 కోట్లు కేటాయింపు

* కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కోసం 35వేల 400 కోట్లు

* మెగా ఇన్వెస్ట్‌మెంట్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌

20 ఏళ్లు దాటిన వాహనాలు తుక్కుకే:

* వాహన కాలుష్యాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి

* పర్యావరణ హితంగా వాహనాలు ఉండాలన్నది లక్ష్యం

* వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారణ

ఆత్మనిర్భర్‌ యోజన పథకం:

* 64,150 కోట్లతో ఆత్మనిర్భర భారత్‌: రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం

* ఆరేళ్లకు గాను 64వేల 180కోట్లతో ఆత్మనిర్భర్‌ యోజన పేరుతో కొత్త పథకం

* నేషనల్‌ డిసిజ్‌ కంట్రోల్‌ సిస్టం మరింత పటిష్టం, దేశవ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు

* ఆరోగ్య రంగానికి పెద్దపీట

* 100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం

* కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం