Aadhaar PAN Link : గడువు పొడిగించకపోతే మార్కెట్ మీద భారీ ప్రభావం పడుతుంది-సెబీకి లేఖ
ఆధార్ పాన్ అనుసంధానం గడువును పొడిగించాలని ANMI కోరింది. లేదంటే మార్కెట్ మీద భారీ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.(Aadhaar PAN Link)

Pan Aadhaar Linking (1)
Aadhaar PAN Link : ఆధార్ తో పాన్ కార్డును అనుసంధానం(లింక్) చేసుకునేందుకు మార్చి 31 లాస్ట్ డేట్. అక్కడితో దీనికి గడువు ముగుస్తుంది. కాగా, ఆధార్ పాన్ అనుసంధానం గడువును పొడిగించాలని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్ చేంజస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా(ANMI) కోరింది. ఈ మేరకు సెబీకి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) లేఖ రాసింది. ఆధార్ పాన్ లింక్ కాకపోతే కొత్త, పాత ఇన్వెస్టర్లు ట్రేడ్ చేయలేకపోతారని తెలిపింది. వారి డీమ్యాట్ ఖాతాలను కూడా సస్పెండ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. దీంతో మార్కెట్ మీద భారీ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుకోవాలంటే పాన్కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయించడం తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. అయినా ఇంకా చాలామంది పాన్-ఆధార్ లింక్ ప్రక్రియను పూర్తి చేయలేదు. ముఖ్యంగా పన్ను కట్టే వ్యాపారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకోసం గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.(Aadhaar PAN Link)
PAN-Aadhaar Linking : 31 లాస్ట్ డేట్.. ఆ తర్వాత రూ.10 వేలు జరిమానా..!
వాస్తవానికి ఆధార్ పాన్ లింకింగ్ కు సంబంధించి ఇప్పటికే గడువు ముగిసినా.. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెల 31వరకు గడువును పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) నిర్ణయం తీసుకుంది. అయితే ఈ గడువును మరోమారు పొడిగించే ప్రసక్తే లేదని తేల్చేసిన సీబీడీటీ.. 31లోగా ఆధార్ కార్డుకు పాన్ కార్డును లింక్ చేయని వారిపై రూ.10 వేల జరిమానాను విధిస్తామని హెచ్చరించింది.
గడువు లోగా పాన్ కార్డ్ హోల్డర్లు తప్పనిసరిగా ఆధార్ నెంబర్ లింక్ చేయాల్సిందే. పాన్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 234H ప్రకారం రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లని పాన్ కార్డ్ ఉపయోగించినట్టైతే రూ.10వేలు జరిమానా చెల్లించాలి.(Aadhaar PAN Link)
ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులను 2022 మార్చి 31 వరకు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఆ పాన్ కార్డ్ చెల్లదు. చెల్లని పాన్ కార్డులను ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించడం చట్ట విరుద్ధం. కాబట్టి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గడువు తర్వాత పాన్, ఆధార్ లింక్ చేసినా జరిమానా చెల్లించాలి.
ఆధార్పై మీ ఫొటో నచ్చలేదా? ఇలా మార్చుకోండి..
ఆధార్-పాన్ లింక్.. ఇలా చేసుకోండి..
* పాన్, ఆధార్ నెంబర్లు లింక్ చేయడానికి పాన్ కార్డ్ హోల్డర్లు ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ https://www.incometax.gov.in/ ఓపెన్ చేయాలి.
* హోమ్ పేజీలోనే Link Aadhaar లింక్ పైన క్లిక్ చేయాలి. మొదట పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. రెండో కాలమ్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు టైప్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డుపై పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే I have only year of birth in Aadhaar card సెలెక్ట్ చేయాలి.
* ఆ తర్వాత I agree to validate my Aadhaar details సెలెక్ట్ చేయాలి. తర్వాత Link Aadhaar క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి Validate పైన క్లిక్ చేయాలి. మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
* ఒకవేళ మీ పాన్, ఆధార్ నెంబర్ ముందే లింక్ అయితే Your PAN is already linked to given Aadhaar అనే మెసేజ్ కనిపిస్తుంది.
* ఎస్ఎంఎస్ ద్వారా పాన్, ఆధార్ లింక్ చేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్న ఫోన్లో ఎస్ఎంఎస్ యాప్ ఓపెన్ చేయండి. New Message ఓపెన్ చేసి UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇవ్వండి. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 10 డిజిట్ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ మెసేజ్ను 567678 లేదా 56161 నెంబర్కు ఎస్ఎంఎస్ పంపండి. మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.