బాలీవుడ్ లో మరో విషాదం..

  • Published By: madhu ,Published On : July 13, 2020 / 06:31 AM IST
బాలీవుడ్ లో మరో విషాదం..

Updated On : July 13, 2020 / 9:44 AM IST

బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. వరుస మరణాలు అందర్నీ కలిచివేస్తున్నాయి. బాలీవుడ్, బుల్లి తెర నటుడు రంజన్ సెహగల్ (36) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. 2020, జులై 11వ తేదీ శనివారం రాత్రి పంజాబ్ రాష్ట్రంలోని చండీగడ్ లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

సెహగల్ శరీరంలోని అవయవాలు పనిచేయకపోవడంతో రంజన్ చనిపోయారని వైద్యులు వెల్లడించారు. ఇక రంజన్ విషయానికి వస్తే…మొదట బుల్లితెర నటుడిగా పరిచయం అయ్యారు. అనంతరం బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. 2016లో రణదీప్ హుడా, ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘సరబిజిత్’ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఫోర్స్, కర్మ వంటి చిత్రాలతో పాటు..పలు పంజాబీ సినిమాల్లో నటించారు. బుల్లితెరపై క్రైమ్‌ పెట్రోల్‌, సావధాన్‌ ఇండియా, తుమ్‌ దేనా సాత్ మేరా లాంటి కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు రంజన్.

రంజన్ మరణంతో అందరూ దిగ్ర్భాంతికి గురయ్యారు. చిన్న వయస్సులో మరణించడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అతడితో నటించిన నటులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రంజన్ మృతిపై సినీ అండ్ టీవీ ఆర్టిస్టు అసోసియేషన్ (CINTAA) నివాళి అర్పించింది.

ఈ ఏడాదిలో బాలీవుడ్ కు చెందిన నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సరోజ్ ఖాన్, వాజిద్ ఖాన్ అనారోగ్యంతో కన్నుమూయగా..యువ నటుడు రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నారు.