Air India Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ సంచలన నివేదిక.. ప్రమాదానికి కారణాలు ఇవే..
విమాన ప్రమాదంపై దర్యాప్తు చేసిన ఎయిర్క్రాప్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేసన్ బ్యూరో (AAIB) తాజాగా 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.

Ahmedabad Plane Crash
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్లో గత నెల 12న ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. లండన్లోని గాట్విక్కు వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయానికి సమీపంలోని మెడికల్ హాస్టల్ కాంప్లెక్స్ను ఢీకొట్టింది. విమానంలో ఉన్న 241 మందిలో ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమాన ప్రమాదంపై ఎయిర్క్రాప్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేసన్ బ్యూరో (AAIB) దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా.. 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.
ఏఏఐబీ నివేదికలో పేర్కొన్న విషయాలు ఇవే..
♦ విమానం టేకాఫ్ అయిన మూడు సెకన్ల తరువాత ఇంజిన్ల ఇంధన కంట్రోలర్ స్విచ్లు సెకన్ పాటు రన్ నుంచి కటాఫ్కు మారాయి. దీని ఫలితంగా అకస్మాత్తుగా థ్రస్ట్ కోల్పోయింది.
♦ ఒక పైలట్ ఎందుకు స్విచ్ఆఫ్ చేసినట్లు అని మరో పైలట్ను ప్రశ్నించాడు. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చాడు. ఇది సాంకేతిక లోపం లేదా అనుకోకుండా యాక్టివేషన్ ను సూచిస్తుందని రిపోర్టులో పేర్కొంది.
♦ కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ తెలిపింది. తర్వాత పైలట్లు మేడేకాల్ ఇచ్చారని నివేదికలో పేర్కొంది.
♦ ఇంజిన్లు పవర్ను కోల్పోగానే.. ఆటోమేటిక్గా హైడ్రాలిక్ పవర్ వచ్చేలా ర్యామ్ ఎయిర్ టర్బైన్ (RAT) కనెక్ట్ అయ్యింది. ఈ పరిణామం ముఖ్యమైన వ్యవస్థలకు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సూచిస్తుంది.
♦ వెంటనే ఇంజన్లను రీస్టార్ట్ చెయ్యడానికి పైలట్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇంజన్1 రికవర్ అయినా ఇంజన్2 మొరాయించడంతో 32 సెకన్లలోనే విమానం కూలిపోయిందని నివేదిక తెలిపింది.
♦ విమానంలో ఫ్యూయల్ క్లీన్గానే ఉందని, ఎటువంటి కలుషిత పదార్థాలు లేవని రిఫ్యూయలింగ్ అథారిటీస్ ద్వారా తేలింది.
♦ విమానాశ్రయం సరిహద్దు గోడను దాటడానికి ముందే విమానం ఎత్తును కోల్పోవడం ప్రారంభించిందని నివేదిక పేర్కొంది.
♦ విమానం ప్రయాణించే మార్గంలో ఏదైనా పక్షి ఎగిరిన దాఖలా లేదని, పక్షి విమానాన్ని ఢీకొట్టినట్లు కనిపించలేదని తెలిపింది. పైగా ఆకాశం క్లియర్గా ఉంది. వాతావరణ సమస్యలు కూడా ఏమీ లేవు.
♦ ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని నివేదికలో స్పష్టం చేసింది.
♦ ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు మేడే కాల్ జారీ చేయబడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ, ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది.
♦ ప్రమాదంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది మరియు అనేక ముఖ్యమైన సాంకేతిక భాగాలను గుర్తించి తదుపరి దర్యాప్తు కోసం పక్కన పెట్టారు.