జమ్మూకశ్మీర్ లో కొత్త పార్టీ లాంఛ్

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. పీడీపీ మాజీ నేత, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సైయద్ అల్టాఫ్ బుఖారి ఇవాళ(మార్చి-8,2020)శ్రీనగర్లో జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ(జేకేఏపీ)ని లాంఛనంగా ప్రారంభించారు. పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్కు చెందిన 31 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ పార్టీలో చేరారు.
ఆర్టికల్ 370 రద్దు అయిన ఆరు నెలల తర్వాత జమ్మూకశ్మీర్లో కొత్త రాజకీయ శక్తి అవతరించడం ఇదే మొదటిసారి. ఇది కుటుంబ పార్టీ కాదని, ఇది సామాన్యుల కోసం, సామాన్యుల చేత ఏర్పడిన పార్టీ అని కొత్త పార్టీని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం బుఖారి అన్నారు. జమ్మూకశ్మీర్ ఎన్నో త్యాగాలు చేసిందని, ప్రజల కలలు సాకారం చేసేందుకు పార్టీ కృషిచేస్తుందని బుఖారి చెప్పారు.
పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎవరైనా సరే రెండు సార్లకు మించి అధ్యక్ష పదవిలో కొనసాగరాదన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ప్రతిష్టను కాపాడేందుకు, కశ్మీర్ పండిట్లు తిరిగి రావడానికి కట్టుబడి ఉంటామని, మహిళలు,యువకుల సాధికారతకు పెద్దపీట వేస్తామని చెప్పారు. పూర్తి ఆశావహ దృక్పథం, నిజాయితీ, నిష్పాక్షికతతో పార్టీ ఏర్పాటు చేశామని, ఈ రాజకీయ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములేనని అన్నారు.