అలంకారంతో మెరిసిపోయిన రాముడు.. ప్రతి ఆభరణానికి ఒక్కో విశిష్టత.. ఏంటో తెలుసా?
బాలరాముడి కిరీటం సూర్యదేవుని చిహ్నంతో ఉంది. ఈ కిరీటంలో కెంపులు, వజ్రాలను పొందుపరిచారు. ఈ బంగారు కిరీటం...
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠను చూసిన జనాలు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ప్రాణప్రతిష్ఠకు ముందు నుంచే బాలరాముడి విగ్రహ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ బాలరాముడు పూర్తిగా ఆభరణాలతో అలంకారంలో మెరిసిపోతూ కనపడ్డాడు. రాముడి విగ్రహానికి అలంకరించిన ప్రతి ఆభరణానికి ఒక్కో విశిష్టత ఉంది. వీటి విశేషాలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.
కిరీటం
బాలరాముడి కిరీటం సూర్యదేవుని చిహ్నంతో ఉంది. ఈ కిరీటంలో కెంపులు, వజ్రాలను పొందుపరిచారు. ఈ బంగారు కిరీటం ఉత్తర భారత సంప్రదాయంతో చేశారు. దీని మధ్యలోనే సూర్యుడి చిహ్నం ఉంది. కిరీటం కుడి వైపున ముత్యాల తంతువులను పెట్టారు.
కౌస్తుభ మణి
కెంపు, వజ్రాలతో కౌస్తుభ మణి ఉంది. బాలరాముడి విగ్రహ హృదయ భాగంలో దీన్ని ఉంచారు. పురాణ గ్రంధాల ప్రకారం.. విష్ణువు అన్ని అవతారాల్లోనూ ఈ రత్నాన్ని హృదయ స్థానంలో ధరించారు.
విజయమాల
విజయానికి చిహ్నంగా విజయమాలను ధరిస్తారు. బాలరాముడి విగ్రహంలో అతి పెద్ద హారం ఇదే. కెంపులు పొదిగి ఉంటుంది. ఇది వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన చిహ్నాలతో ఉంది. అంటే సుదర్శన చక్రం, కమలం, శంఖం, మంగళ కలశం ఇందులో కనపడతాయి.
ఇతర ఆభరణాలు
- బాలరాముడి విగ్రహ హారాల్లో ఒకటి అర్ధ చంద్రాకారంలో ఉంటుంది. దీనిని కాంత అని అంటారు. అదృష్టాన్ని సూచించే పూల డిజైన్లతో దీన్ని రూపొందించారు. మధ్యలో సూర్యుడి చిత్రం కూడా ఉంటుంది.
- నాభి పైన పాదిక అనే మరొక హారము ఉంది. వజ్రాలు, పచ్చలతో చేసిన ఐదు పోగుల ముక్క ఇది.
- అలాగే, కంచి అనే వజ్రాల కెంపులు, ముత్యాలు, పచ్చలతో పొదిగిన బంగారు నడుము పట్టీ కనపడుతుంది. స్వచ్ఛతకు ప్రతీకగా చిన్న చిన్న గంటలు ఇందులో ఉంటాయి.
- బాలరాముడి విగ్రహాన్ని ఆర్మ్లెట్స్, కంకణాలు, ఉంగరాలతోనూ అలంకరించారు.
- బాలరాముడి ఎడమ చేతిలో ముత్యాలు, పచ్చలతో చేసిన బంగారు విల్లు, అలాగే కుడి వైపున బాణం ఉంది.
- బాలరాముడి విగ్రహ నుదుటిపై వెండి-ఎరుపు తిలకాన్ని వజ్రాలు, కెంపులతో రూపొందించారు.
- పురాణ గ్రంధాలు అధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, రామచరితమానస్, ఆళవందర్ స్తోత్రాలతో పాటు గ్రంథాల పరిశోధన, అధ్యయనం ఆధారంగా ఈ ఆభరణాలను రూపొందించినట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఆభరణాలను లక్నోలోని హర్షహైమల్ షియామ్లాల్ జ్యువెలర్స్, శ్రీ అంకుర్ ఆనంద్ ఇన్స్టిట్యూషన్ రూపొందించాయి.
- బనారసీ ఫాబ్రిక్, త్రెడ్ వర్క్తో రాముడి పసుపు ధోతీ, ఎరుపు రంగు అంగవస్త్రం, శంఖ, పద్మ, చక్ర మయూర్ను రూపొందించి అలంకరించారు. గార్మెంట్లను ఢిల్లీ టెక్స్టైల్ డిజైనర్ మనీశ్ త్రిపాఠి రూపొందించారు.