covid vaccination : పనిచేసే చోటే వ్యాక్సిన్
కోవిడ్ వ్యాక్సినేషన్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పనిచేసే చోటే టీకా ఇవ్వాలని నిర్ణయించింది.
key decision on covid vaccination : కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పనిచేసే చోటే వ్యాక్సిన్ ఇవ్వాలని, 45 ఏళ్లు దాటిన వారికి.. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండగా.. వైరస్ వర్రీ మాత్రం తగ్గట్లేదు.
ఈ క్రమంలోనే దేశంలో రెండో దఫా కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.. అన్ని వయసుల వారికి కొవిడ్ వ్యాక్సిన్ అందించాలనే డిమాండ్ ఎక్కువైంది. ముఖ్యంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని… ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ ఎందుకు అందించకూడదనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేయడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ను ఎక్కువ మందికి ఇవ్వవచ్చని సూచిస్తూ ఢిల్లీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ మధ్యే ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు. ఇలాంటి కీలక సమయంలో విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతికి ప్రాధాన్యం ఇవ్వకుండా.. దేశీయ అవసరాలను గుర్తించాలన్నారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా వ్యాక్సిన్ను 18 ఏళ్ల వయసు పైబడిన వారికి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధానికి నిన్న లేఖ రాసింది. దేశంలో సెకండ్ వేవ్ ఉదృతంగా ఉందని, అందుకే యుద్ధ ప్రాతిపదికను టీకాలు ఇవ్వాలని IMA కోరింది. యుద్ధప్రాతిపదికన టీకాలు వేయడంతో… కరోనాను అరికట్టవచ్చని ఐఎంఏ స్పష్టం చేసింది. అయితే, అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం ఇందుకు మరికొంత సమయం పడుతుందని పరోక్షంగా వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసిన తర్వాతే టీకా అందించడం జరుగుతోందని తెలిపింది. మరణాల నుంచి రక్షించడమే టీకా ప్రధాన ఉద్దేశమని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. విదేశాల్లో కూడా 50 ఏళ్లు దాటిన వారికే టీకాలు అందిస్తున్నారని… కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మన దేశంలో 45 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది.