ప్రపంచంపై కరోనా పంజా : 12 లక్షల బాధితులు..70 వేల మరణాలు

కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం యుద్ధం చేస్తోంది. కరోనా వైరస్… ఇప్పుడు ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. యావత్ ప్రపంచం కోవిడ్ దెబ్బకు దెబ్బకు హడలిపోతోంది. చైనాలో పురుడుపోసుకున్న ఈ మహమ్మారి.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతాపం చూపుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 12 లక్షల 66వేలు దాటింది. నిన్న ఒక్కరోజే కొత్తగా 65వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 69వేల మందికి పైగా బలైపోయారు. నిన్న ఒక్కరోజే 4వేల మందికి పైగా కరోనా రాకాసి బలి తీసుకుంది. ఇక కరోనా బారినపడ్డ… దాదాపు 2 లక్షల 61వేల మంది కోలుకున్నారు. అయితే మరో 45వేల మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.
అమెరికాలో :-
కరోనా వైరస్ అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అక్కడ మొత్తం 3 లక్షల 34 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేవలం 24 గంటల వ్యవధిలో 23 వేల కేసుల దాకా కొత్తవి నమోదయ్యాయి. అదే సమయంలో అగ్రారాజ్యంలో కోవిడ్ మృతుల సంఖ్య పది వేలకు చేరువలో ఉంది. నిన్న ఒక్కరోజే వెయ్యి మందికి పైగా మరణించారు.
ఇటలీలో :-
ఇటలీలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కరోనా పంజాకు ఇటలీ దేశం చిగురుటాకులా వణికిపోతోంది. ప్రజలు కరోనా బారినపడి పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు ఇటలీలో కరోనా.. 15వేల 887 మందిని బలితీసుకుంది. నిన్న ఒక్కరోజే దాదాపు 525మంది చనిపోయారు. కరోనా మరణాలు ఇప్పటి వరకు ఇటలీలోనే ఎక్కువగా సంభించాయి. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య లక్షా 28వేలు దాటింది. నిన్న కొత్తగా మరో 4వేల 3వందల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇటలీలో ఇప్పటి వరకు కరోనా బారినపడి 21వేల మంది కోలుకోగా… మరో 4వేల మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
స్పెయిన్ లో :-
స్పెయిన్లోనూ కరోనా కోవిడ్ కోరలు చాస్తోంది. కరోనా రాకాసి దాహానికి స్పెయిన్ విలవిల్లాడుతోంది. ఇప్పటి వరకు స్పెయిన్లో లక్షా 30వేల మంది కరోనా బారిన పడ్డారు. నిన్న కొత్తగా 5వేల మందికి ఈ వైరస్ సోకింది. ఇక ఇప్పటి వరకు ఈ దేశంలో 12 వేల 518మంది పౌరులు కరోనాతో చనిపోయారు. నిన్న ఒక్కరోజే 571మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. ఇటలీ తర్వాత అత్యధిక మరణాలు సంభవించింది స్పెయిన్లోనే.
బ్రిటన్ లో :-
ఇక బ్రిటన్లో కరోనా మహమ్మారి ప్రతాపం చూపుతోంది. దీంతో ఈ దేశంలో పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు బ్రిటన్లో కరోనా కేసులు 47వేలు దాటాయి. నిన్న కొత్తగా మరో 6వేల కేసులు నమోదయ్యాయి. యూకేలో కరోనా మరణాలు 5వేలకు చేరువలో ఉన్నాయి. కరోనా నియంత్రణకు బ్రిటన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయినా వైరస్ వ్యాప్తి మాత్రం కట్టడి కావడం లేదు.
ఫ్రాన్స్ లో :-
ఫ్రాన్స్లో కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. దీంతో ఈ దేశంలో బాధితుల సంఖ్య 92 వేలకు చేరింది. నిన్న ఒక్కరోజే 3 వేల మందికి కొత్తగా కరోనా నిర్ధారణ అయ్యింది. అయితే ఈ దేశంలో కరోనా బారినపడి ఇప్పటి వరకు 8వేలకు పైగా పౌరులు మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 621మంది కరోనాతో కన్నుమూశారు. దీంతో ఫ్రాన్స్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
జర్మనీ లో :-
జర్మనీలో కోవిడ్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య లక్షకు చేరింది. జర్మనీలో ఇప్పటి వరకు కరోనాతో 1576మంది చనిపోయారు. నిన్న కొత్తగా 132 మందిని కరోనా మహమ్మారి బలితీసుకుంది.
ఇరాన్ లో :-
ఇక ఇరాన్లో నిన్న ఒక్కరోజే 150 మంది చనిపోయారు. టర్కీలో 73మంది, స్విట్జర్లాండ్లో 50మంది, బెల్జియంలో 164 మందిని కరోనా బలితీసుకుంది. నెదర్లాండ్లో 115 మంది కరోనాతో కన్నుమూశారు.
See Also | కరంటోళ్లకు కంగ్రాట్స్ : విద్యుత్ శాఖపై కేసీఆర్ ప్రశంసలు