Corona India: కరోనా తగ్గుముఖం.. రికవరీ కేసులే ఎక్కువ
భారత్లో గత 20 రోజులుగా కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మే 17 నుంచి వరుసగా 3 లక్షల లోపు కేసులు నమోదవుతున్నాయి.

Corona India
భారత్లో గత 20 రోజులుగా కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మే 17 నుంచి వరుసగా 3 లక్షల లోపు కేసులు నమోదవుతున్నాయి. 15 రాష్ట్రాలలో వెయ్యి నుంచి 5 వేల కేసులు, 13 రాష్ట్రాలలో 1000 లోపు కేసులు నమోదవుతున్నాయి.
దేశంలో యాక్టివ్ కేసుల కన్నా రికవరి కేసుల సంఖ్యా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం దేశంలో రికవరి రేటు 85.6 శాతం నుంచి 90 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.
భారత్లో కోవిడ్ సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుతోందన్నారు నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్. త్వరలోనే దేశంలో మరో 4 వ్యాక్సిన్లు బయో-ఈ వ్యాక్సిన్, జైడస్, స్పుత్నిక్, జెనోవా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. 2021 చివరి నాటికి 200 కోట్ల డోసులు ఉత్పత్తి అవుతాయన్నారు.
భారత్ బయోటెక్ కోవాగ్జిన్ సెప్టెంబర్, అక్టోబర్ నాటికి 10 కోట్ల డోసుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుందన్నారు. సీరం ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్ నెలకు 6.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తుందని వీకే పాల్ వెల్లడించారు. ఫైజర్ సహా పలు అంతర్జాతీయ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.