PNB Employee Oxygen Tank : లీవ్ ఇవ్వలేదని.. ఆక్సిజన్ సిలిండర్‌తో ఆఫీసుకి వచ్చిన బ్యాంకు మేనేజర్, డ్రామాగా తేల్చేసిన బ్యాంకు

జార్ఖండ్ లో జరిగిన ఓ ఘటన వైరల్ గా మారింది. బొకారోలో పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఆఫీసుకి రావడం చర్చనీయాంశంగా మారింది.

PNB Employee Oxygen Tank : లీవ్ ఇవ్వలేదని.. ఆక్సిజన్ సిలిండర్‌తో ఆఫీసుకి వచ్చిన బ్యాంకు మేనేజర్, డ్రామాగా తేల్చేసిన బ్యాంకు

Pnb Employee Oxygen Tank

Updated On : May 28, 2021 / 11:10 AM IST

PNB Employee Reaches Office With Oxygen Tank : జార్ఖండ్ లో జరిగిన ఓ ఘటన వైరల్ గా మారింది. బొకారోలో పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఆఫీసుకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పేరు అరవింద్ కుమార్. బొకారోలని పీఎన్బీ మేనేజర్. ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఇప్పడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే సడెన్ గా ఆయన తన భార్య, కొడుకుకు, ఆక్సిజన్ సిలిండర్ వెంట పెట్టుకుని ఆఫీసుకి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఎందుకిలా చేశారంటే.. తనకు లీవ్ అడిగితే ఇవ్వలేదని, మరో దారి లేక ఇలా ఆఫీసుకి వచ్చానని అరవింద్ కుమార్ చెప్పారు.

”నేను పూర్తిగా కోలుకోవడానికి మూడు నెలల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇన్ ఫెక్షన్ ఎక్కువగా ఉంది. లంగ్స్ లోకి వెళ్లింది. అందుకే మూడు నెలలు రెస్ట్ అవసరం అని డాక్టర్లు చెప్పారు. నాకు లీవ్ కావాలని అడిగాను. కానీ, యాజమాన్యం ఒప్పుకోలేదు. లీవ్ ఇవ్వకుండా ఆఫీసుకి రావాలని వేధింపులకు గురి చేసింది. మరో దారి లేక ఇలా ఆక్సిజన్ సిలిండర్ తో ఆఫీసుకి వచ్చాను” అని అరవింద్ కుమార్ చెప్పారు.

అరవింద్ కుమార్ ఆక్సిజన్ సిలిండర్ తో ఆఫీసుకి రావడాన్ని అతడి కుటుంబసభ్యులు వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. లీవ్ ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తోందని అరవింద్ కుమార్ ఆరోపించారు. ఈ వ్యవహారం దుమారం రేపడంతో బ్యాంకు యాజమాన్యం స్పందించింది. అరవింద్ కుమార్ ఆరోపణలను కొట్టిపారేసింది. అదంతా డ్రామా అని తేల్చింది. లోన్ అకౌంట్స్ లో అవకతవకలు జరిగాయని, దానికి సంబంధించి విచారణ జరుగుతోందని వివరించింది.

దీని నుంచి తప్పించుకోవడానికి అరవింద్ కుమార్ ఇలా డ్రామా ఆడినట్టు తెలిపింది. అరవింద్ కుమార్ పై అనేక ఆరోపణలు ఉన్నాయంది. గత రెండేళ్లుగా పర్మిషన్ లేకుండానే ఆయన ఆఫీసుకి రావడం లేదని యాజమాన్యం చెప్పింది. కరోనా బారిన పడ్డ ఉద్యోగులకు లీవ్ ఇవ్వడం లేదనే ఆరోపణల్లో వాస్తవం లేదంది. ఈ నెల 25న అరవింద్ కుమార్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఆఫీసుకి వెళ్లారు. ఆ తర్వాత దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.