sugar candy : పీచు మిఠాయి చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. రోడ్డు మీద కనిపిస్తే చాలు పిల్లలు కొని పెట్టమని మారాం చేస్తారు. నోట్లో వేసుకోగానే తీయగా కరిగిపోయే ఈ పీచు మిఠాయి తింటే చాలా ప్రమాదకరమట. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి దీనిపై నిషేధం విధించాక ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. దీంతో పీచు మిఠాయి తినేవారంతా హడలిపోయారు. అసలు పీచు మిఠాయి ఎందుకు ప్రమాదకరం?
Special Recipes : రెడిమేడ్ పిండి వంటలకు భలే గిరాకీ.. విదేశాలకు ఎగుమతి
పీచు మిఠాయి తయారీలో వాటికి రంగు రావడం కోసం రోడమైన్-బి అనే కెమికల్ ఉపయోగిస్తున్నారట. ఇది క్యాన్సర్ కారకంగా ఇటీవల కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. దాంతో తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం విధించారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. అక్కడి ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు సైతం తనిఖీలు చేపట్టి.. పీచు మిఠాయి నమూనాలను ల్యాబ్కు పంపించి పరీక్షలు చేయించారు. ఈ కాటన్ క్యాండీల తయారీలో రోడమైన్-బి అనే కెమికల్ ఉన్నట్లు తేలింది. దీంతో సీరియస్ అయిన ప్రభుత్వం పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించింది. అంతేకాదు. తినడం కూడా నేరంగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలో కూడా పీచు మిఠాయి విక్రయాలు నిషేధిస్తున్నట్లు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు. పిల్లల కోసం వీటిని కొనడం మానుకోవాలని ప్రజలను కోరారు. ఇందులో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి హాని చేస్తాయని.. రోడమైన్-బి కెమికల్ వీటిలో కలుస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు కనుగొన్నారని ఆమె వెల్లడించారు.
పీచు మిఠాయి తయారీలో వాడుతున్న రోడమైన్-బి అనే కెమికల్ బట్టలకు రంగులు అద్దే పనిలో, పేపర్ ప్రింటింగ్లో వాడతారట. ఇది తినడం వల్ల కిడ్నీలు, లివర్ పై ప్రభావం చూపించడంతో పాటు అల్సర్ వంటి ప్రమాదకర వ్యాధులతో పాటు క్యాన్సర్ సోకే అవకాశం కూడా ఉందట. తమిళనాడు, పుదుచ్చేరిలలో ప్రస్తుతం పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం అమలు చేసారు. మరి ఇతర రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.