అఫిడవిట్ తో ఈసీకి మాజీ పోలీస్ అధికారి ఝలక్

చెన్నై: అఫిడవిట్ తో ఎన్నికల సంఘానికి ఝలక్ ఇచ్చాడు ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కుమారుడు. ఈసీ ఉదాసీనతను తెలియజేసేందుకు వినూత్నరీతిలో తెలియజేస్తు..తన ఆస్తి రూ.1.76 లక్షల కోట్లు.. అప్పులు రూ.4 లక్షల కోట్లు అని అఫిడవిట్లో ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతనే పెరంబూరు అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నిక కోసం మాజీ పోలీసు అధికారి అయిన జే మోహన్రాజ్. మోహన్ రాజ్ ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కుమారుడు కూడా.
అఫిడవిట్ల పరిశీలనలో ఎన్నికల సంఘం ఉదాసీనతను ఎండగట్టడం కోసమంటూ తమిళనాడులో ఓ వ్యక్తి తన ఎన్నికల అఫిడవిట్లలో ఆస్తి వివరాలను సరికొత్త పద్ధతిలో ప్రకటించారు. తన ఆస్తి రూ.1.76 లక్షల కోట్లు.. అప్పులు రూ.4 లక్షల కోట్లు అని ఆయన అఫిడవిట్లో ప్రస్తావించారు. ఈ నంబర్ల వెనుక చాలా పెద్ద కారణముంది. తన ఆస్తిగా చెప్పిన 1.76 లక్షల కోట్లు అనేది ..2జీ కుంభకోణం విలువ. ఇక రూ.4 లక్షల కోట్ల అప్పు అనేది ..తమిళనాడు ప్రభుత్వం చేసిన అప్పులు.
అఫిడవిట్ దాఖలులో ఒక్క దెబ్బకు మూడు పిట్టలు
ఇలా ఒక్క దెబ్బతో మూడు పిట్టలన్నట్లుగా..ఆ వ్యక్తి ఇలా వినూత్నంగా తన ఎన్నికల అఫిడవిట్ను దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ దాఖలు చేయడం విశేషం. స్వాతంత్య్ర సమరయోధుడి తనయుడైన మోహన్ రాజ్ ఎందుకిలా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని అడిగిన దానికి సమాధానం ఏం చెప్పాడో తెలుసా.. 2జీ కుంభకోణం కేసును సరిగా విచారించలేదనీ.. అందుకే అందరి దృష్టి 2జీపై పడాలనే ఉద్ధేశంతో తన ఆస్తిని రూ.1.76 లక్షల కోట్లుగా ప్రకటించానని తెలిపారు.
లక్షల కోట్ల అప్పేమిటి
వరల్డ్ బ్యాంక్కు 4 లక్షల కోట్లు బాకీ పడ్డట్లు చూపడం గురించి ఏం చెప్పారంటే..ఆ మొత్తం తమిళనాడు ప్రభుత్వం చేతగాని పనితీరును ఎత్తి చూపేందుకేనన్నారు. తమిళనాడు బడ్జెట్లో రాష్ట్రంపై మొత్తం రూ.3,97,495 కోట్ల అప్పు ఉన్నట్లు చూపించారు. దీనినే మోహన్రాజ్ తన అఫిడవిట్ లో ప్రస్తావించారు. 2009లోనూ ఇలాగే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన మోహన్రాజ్ తన డిపాజిట్లు రూ.1977 కోట్లు అని చూపించారు. మరి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసినందుకు చర్యలేమీ తీసుకోలేదా అని ప్రశ్నిస్తే.. ఇప్పటి వరకు కనీసం తనకు నోటీసు కూడా రాలేదని ఆయన చెప్పడం గమనించాల్సిన విషయం.