బాహుబలి దసరా: శరన్నవరాత్రి వేడుకల్లో మాహిష్మతి సామ్రాజ్యం
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది. దేశ వ్యాప్తంగా భక్తులు అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో హర్యానాలోని ఎన్ఐటీ ఫరీదాబాద్లో దసరా గ్రౌండ్ నవరాత్రుల దసరా ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
దీంట్లో భాగంగా.. రామ్లీలా కమిటీ ప్రత్యేక స్వాగత ద్వారాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ‘బాహుబలి’ సినిమా సెట్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రామ్ లీలా కమిటీ గడచిన 50 ఏళ్లుగా దసరా ఉత్సవాలను నిర్వహిస్తూన్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో బాహుబలి సినిమాలోని ‘మాహిష్మతీ సామ్రాజ్యం’కొలువుతీరనుంది. దీని కోసం నిపుణులు ప్రత్యేక సెట్ తీర్చిదిద్దుతున్నారు.
అంతేకాదు ప్రతీ దృశ్యాన్ని సెల్ఫీలలో బంధించే సెల్ఫీ ప్రియుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ‘బాహుబలి’ చిత్రంలోని మాహిష్మతి సామ్రాజ్యాన్ని తలపించేలా భారీ సెట్ రూపొందిస్తున్నారు.
ఈ వేడుకల్లో పలు రకాల ఉత్పత్తుల షాపులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ అందుబాటులో ఉండనున్నాయి. చిన్నారుల కోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా మ్యాజిక్ షోలు…ఆడుకునేందుకు రైళ్లు, బోట్లు వంటి పలు రకాల ఐటెమ్స్ ను అందుబాటులో ఉంచారు.
ఈ వేడుకల్లో జర్మనీ స్టాల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. సందర్శకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఉత్సవ కమిటీ పటిష్ట ఏర్పాట్లను చేశామని సభ్యులు తెలిపారు.