మొదటి లోక్ పాల్ గా జస్టిస్ పినాకి చంద్రఘోష్

ఢిల్లీ: దేశ ప్రధమ లోక్ పాల్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ పేరును కేంద్ర పరిశీలిస్తోంది. 2017లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఆయన ప్రస్తుతం జాతీయ మానవ హ్కకుల సంఘం సభ్యునిగా ఉన్నారు. పీఎం మోడీ ఆధ్వర్యంలోని ఎంపిక సంఘం ప్రధమ లోక్ పాల్ గా ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రధమ లోక్ పాల్ నియామకానికి ఏర్పాట్లు జరగటం పట్ల సామాజిక ఉద్యమ కారుడు అన్నా హజారే హర్షం వ్యక్తం చేశారు. 48 ఏళ్లుగా సాగుతున్న ప్రజాఉద్యమ ఫలితం ఇదని ఆయన అన్నారు.
Read Also : వామ్మో: వరదలకు విమానమే కొట్టుకొచ్చేసింది
కలకత్తాలోని దివాన్ బనారసీ ఘోష్ కుటుంబానికి చెందిన అయిదో తరం న్యాయవాది పీసీ ఘోష్. ఆయన పూర్వీకుడు హరచంద్ర ఘోష్ కలకత్తాలో బ్రిటీషువారు నెలకొల్పిన సదర్ దివానీ అదాలత్ కు 1876 లో తొలి భారతీయ ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఆయన తండ్రి శంభు చంద్ర ఘోష్ కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసారు. 1976 లో కలకత్తా హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టిన పీసీ ఘోష్ 1997 లో ఆ హైకోర్టుకు న్యాయమూర్తి అయ్యారు.
2012 లో అక్కడి నుంచి ఉమ్మడి ఏపీ హై కోర్టుకు బదిలీ అయి ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. అనంతరం 2013 లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది నాలుగేళ్లపాటు విధులు నిర్వర్తించి 2017 మే నెలలో పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ అనంతరం జూన్ 29 నుంచి ఆయన మానవ హక్కుల సంఘం సభ్యునిగా కొనసాగుతున్నారు.