ఇండియన్ ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్..కేంద్రం ఉత్తర్వులు

భారత సైన్యానికి సంబంధించి నరేంద్ర మోదీ సర్కార్ మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భారత సైన్యంలో పురుషులతో సమాన హోదా పొందాలనే మహిళా అధికారుల కల నెరేవేరింది. షార్ట్ సర్వీస్ కమిషన్ కింద నియమితులైన మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్ మంజూరు చేయాలని పేర్కొంటూ కేంద్ర సర్కారు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశించిన ఐదు నెలల తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంతో సైన్యంలో మహిళల ప్రాధాన్యత పెరగడంతోపాటు ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వాళ్లు ఉన్నత పదవులు పొందడానికి అవకాశం లభిస్తుందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఆర్మీలోని మొత్తం 10 విభాగాల్లోనూ మహిళలకు సమాన హక్కులు లభిస్తాయి. ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీంకోర్టు భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్, కమాండింగ్ రోల్స్ ఇవ్వాల్సిందేనని, దానిపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతమున్న జడ్జి అండ్ అడ్వొకేట్ జనరల్ (జాగ్), ఆర్మీ ఎడ్యుకేషనల్ కార్ప్స్ (ఏఈసీ) లతోపాటు భారత సైన్యంలోని మొత్తం పది స్ట్రీమ్లలో ఎస్ఎస్సీ మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేయాలని కేంద్ర సర్కారు ఇవాళ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆర్మీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ ఉత్తర్వులు మహిళా అధికారుల సాధికారతకు, వారు సైన్యంలో కీలక పాత్ర పోషించేందుకు దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
శాశ్వత కమిషన్ మంజూరుకు ఎస్ఎస్సీ మహిళా అధికారులందరి ఎంపిక, అవసరమైన డాక్యుమెంటేషన్ కోసం సెలక్షన్ బోర్డు త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తుందని ఆయన వివరించారు. నేటి ఉత్తర్వులతో బాధిత మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్ సెలక్షన్ బోర్డును నిర్వహించడానికి ఆర్మీ ప్రధాన కార్యాలయం ఇప్పటికే సన్నాహక చర్యలను ప్రారంభించిందని అధికారులు తెలిపారు.
అంతేకాక శిక్షణ, శారీరక ఓర్పు, పోస్టింగ్ వంటి అంశాలకు సంబంధింది ప్రస్తుత విధానాలను మార్చేందుకు ఆర్మీ సిద్ధమయ్యింది.
మెడికల్ కార్ప్స్, డెంటల్ కార్ప్స్, మిలిటరీ నర్సింగ్ సర్వీసులను మినహాయించి ఇప్పటివరకు భారత సైన్యంలో మహిళలు కేవలం 3.89 శాతం ఉండగా, నేవీలో 6.7 శాతం, వైమానిక దళంలో 13.28 శాతం మాత్రమే ఉన్నారు.
ఇప్పటివరకు ఆర్మీలో మహిళల ప్రవేశం షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సి) ద్వారా మాత్రమే జరిగింది. అయితే వారు 14 సంవత్సరాలకు మించి సేవ చేయలేకపోయారు. అయినప్పటికీ, కొంతమందికి పొడిగింపులను కొనసాగించారు.
1992లో తొలిసారి త్రివిధ దళాల్లో మహిళలకు అవకాశం కల్పించారు. ఎంపికైన మహిళలను షార్ట్ సర్వీస్ కమిషన్లో నియమించేవారు. ఇలా ఉద్యోగాల్లో చేరిన మహిళలు కొంత కాలానికే రిటైర్ కావాల్సి ఉంటుంది. 1992లో ప్రారంభమైన వుమెన్ షార్ట్ సర్వీస్ కమిషన్ తొలుత అయిదేళ్లకే ఉండేది. తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకునే అవకాశం కల్పించారు. మహిళలు గరిష్టంగా 14 ఏళ్లపాటు త్రివిధ దళాల్లో పనిచేసేలా 2006లో షార్ట్ సర్వీస్ కమిషన్ నిబంధనలు మార్చారు. కాని వారికి శాశ్వత కమిషన్ ఇవ్వలేదు.
ప్రస్తుతం ఆర్మీలో 300 మందికి పైగా మహిళా అధికారులుకు 14 ఏళ్ల సర్వీస్ పూర్తయ్యింది. వీరంతా ప్రస్తుతం పొడిగింపుపై పనిచేస్తున్నారు. మాతృత్వం, శారీరక పరిమితి, పిల్లల సంరక్షణ, గ్రామీణ నేపథ్యాల వంటి అంశాలను సాకుగా చూపుతూ మహిళలను కమాండ్ స్థాయి పదవులకు తీసుకోలేదు. ప్రస్తుత నిర్ణయంతో ఈ అడ్డంకి తొలగిపోయినట్లు అయింది.