“మహా” పోలీసుల అక్రమ బదిలీపై 6GB కాల్ డేటా ఉంది..ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలు ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహావికాస్ అఘాడీ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ ఎదురుదాడి మరింత తీవ్రం చేసింది.

Devendra Fadnavis
Devendra Fadnavis మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలు ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహావికాస్ అఘాడీ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ ఎదురుదాడి మరింత తీవ్రం చేసింది. హోంమంత్రిని కాపాడుకునే క్రమంలో మహా వికాస్ అఘాఢీ (MVA) ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకుందని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు.
పోలీసు బదిలీలలో,పోస్టింగ్ లలో భారీ అవినీతి జరిగిందని, పోలీసు వ్యవస్థలో చుట్టూ బ్రోకర్లు ఉన్నారని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోందని ఫడ్నవీస్ ఆరోపించారు. పోలీసుల బదిలీలు, పోస్టింగ్లలో పెద్ద ఎత్తున అవినీతికి సంబంధించిన ఆడియో టేపులతో ఆధారాలు బయటపెట్టిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నివేదికపై మహారాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోలేదని ఫడ్నవీస్ ధ్వజమెత్తారు. పోలీస్ ఫోర్స్లో అనుకూలమైన బదిలీల కోసం లంచం రాకెట్లపై గతేడాది ఆగస్టులోనే అప్పటి డీజీపీ సుబోద్ జైస్వాల్ కి ఇంటిలిజెన్స్ కమిషనర్ ఒక నివేదికను సమర్పించినట్లు దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. తర్వాత వాటిని ముఖ్యమంత్రికి అందజేశారు.. వీటిపై ఆయన కొంత ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. జీఏడీ ద్వారా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దంటూ అడ్డుకున్నారు అని ఫడ్నవీస్ ఆరోపించారు. బదిలీల రాకెట్ వ్యవహారం తన నోటీసుకు వచ్చినా ప్రభుత్వాన్ని కాపాడుకోడానికే ఉద్ధవ్ ప్రాధాన్యత ఇచ్చారని దుయ్యబట్టారు.
మూడు ప్రభుత్వాల కింద ఇంటెలిజెన్స్ కమిషనర్ హోదాలో పనిచేసిన రష్మీ శుక్లా మంచి ట్రాక్ రికార్డ్ ఉందని, ఆ అధికారి బయటపెట్టిన బదిలీ రాకెట్ను తప్పుపట్టలేమని అన్నారు. రష్మీ శుక్లా సీనియర్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ పదోన్నతి విషయంలో పక్కనబెట్టి ఆమెను ప్రాధాన్యత లేని పౌర భద్రత విభాగానికి డైరెక్టర్ జనరల్గా నియమించారు.. మరోవైపు, పైరవీలు చేసినవారికి కోరుకున్న పోస్టులు వచ్చాయని అన్నారు.
త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఉద్ధవ్ సర్కార్ బండారం బయటపెడతామని ఫడ్నవీస్ హెచ్చరించారు. మహారాష్ట్ర పోలీస్ శాఖలో ఐపీఎస్, నాన్-ఐపీఎస్ అధికారుల బదిలీల రాకెట్కి సంబంధించిన కీలక పత్రాలు, కాల్ రికార్డింగులు తమ వద్ద ఉన్నట్లు తెలిపారు. ఈ డేటాను త్వరలోనే ఢిల్లీ వెళ్లి, కేంద్ర హోంశాఖ సెక్రటరీకి అందజేసి సీబీఐ విచారణ కోరతామన్నారు. ముఖ్యమంత్రి జీఏడీ బాధ్యతలను నిర్వర్తించినప్పటికీ నివేదికపై ఎటువంటి చర్య తీసుకోలేదు.. కేంద్ర హోం శాఖ కార్యదర్శి దీనికి సంరక్షకుడు కాబట్టి నేను నివేదికను ఆయనకు సమర్పిస్తాను అని ఫడ్నవీస్ తెలిపారు. ‘బదిలీ రాకెట్ కి సంబంధించి తన వద్ద మొత్తం 6.3 జీబీ డేటా ఉందని ఆయన అన్నారు. బదిలీ రాకెట్ వ్యవహారంలో హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పాత్ర కీలకమని ఫడ్నవీస్ ఆరోపించారు. ఆయనను వెంటనే బర్తరఫ్ చేసిన విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హోంమంత్రి దేశ్ముఖ్ పదవిలో కొనసాగితే న్యాయమైన దర్యాప్తు సాధ్యం కానందున ఆయనను తొలగించాలన్నారు.
మరోవైపు, హోంమంత్రిని అనిల్ దేశ్ ముఖ్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ శరద్ పవార్ పై ఫడ్నవీస్ ఫైర్ అయ్యారు. జాతీయ నాయకుడు అయిన శరద్ పవార్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయవద్దని ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 5 నుంచి 15 మధ్య అనిల్ దేశ్ ముఖ్ ఆసుపత్రిలో, ఆ తర్వాత ఫిబ్రవరి 15 నుంచి 27 మధ్య నాగ్ పూర్ లోని ఆయన ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నారని సోమవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో శరద్ పవార్ చెప్పిన విషయం తెలిసిందే.
అయితే,హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ కరోనాతో నిర్బంధంలో ఉన్నమాట అవాస్తమన్నారు ఫడ్నవీస్. వీఐపీల కదలికలపై పోలీసుల వద్ద ఉన్న రికార్డుల ప్రకారం…హోంమంత్రి ఫిబ్రవరి 17న సహ్యాద్రి గెస్ట్ హౌస్కి, ఫిబ్రవరి 24న మంత్రాలయానికి వెళ్లారని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 15 నుంచి 27 వరకు హోంమంత్రి హోం క్వారంటైన్లోనే ఉన్నప్పటికీ.. అధికారులను తరుచూ కలుసుకుంటున్నారు. ఆయన ఐసోలేషన్లో లేరు. ఆయనకు నిన్న శరద్ పవార్ సరిగ్గా చెప్పలేదనుకుంటా అంటూ ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు.