7 Layer Holograms: లిక్కర్ బాటిల్స్కి ‘Z+ సెక్యూరిటీ’.. అర్థం కావట్లేదా? ఏం చేస్తున్నారో చూడండి..
వీటి నకిలీలను తయారు చేయడం దాదాపు అసాధ్యం.
7 Layer Holograms: ఛత్తీస్గఢ్లో మద్యం సీసాలకు ‘జెడ్ ప్లస్ భద్రత’ కల్పిస్తున్నారు. అంటే.. వాటిపై 7 లేయర్ హోలోగ్రామ్ ముద్రిస్తున్నారు. ఇలాచేస్తే నకిలీ మద్యాన్ని, అబ్కారీ శాఖలో జరిగే అవకతవకలను పూర్తిగా అరికట్టవచ్చని అక్కడి బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఛత్తీస్గఢ్లోని గత కాంగ్రెస్ సర్కారు హయాంలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరుగుతోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎంఓలో ఉప కార్యదర్శిగా పనిచేసిన రాష్ట్ర పరిపాలనా సేవల అధికారి సౌమ్య చౌరాసియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.
రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంతో ప్రస్తుత సీఎం విష్ణు దేవ్ సాయ్ ప్రభుత్వం మొత్తం అబ్కారీ వ్యవస్థను మార్చింది. మద్యం సీసాలపై అధిక భద్రతతో కూడిన హోలోగ్రామ్లు ఉండేలా చేస్తోంది. దీన్నే నెటిజన్లు.. లిక్కర్ బాటిల్స్కి ‘Z+ సెక్యూరిటీ’ అంటూ చమత్కారంగా పిలుస్తున్నారు.
సీసాలపై అమర్చే హోలోగ్రామ్ ముద్రణ మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ‘నోటు ముద్రణ కేంద్రం’లో జరుగుతోంది. ఈ హోలోగ్రామ్ 7 లేయర్లతో తయారవుతుంది. వీటి నకిలీలను తయారు చేయడం దాదాపు అసాధ్యం.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణంలో నకిలీ హోలోగ్రామ్ వ్యవహారం కూడా ఉంది. ఈ కారణంతో ఈ సారి ఛత్తీస్గఢ్ అబ్కారీ శాఖ హోలోగ్రామ్ వ్యవస్థను పూర్తిగా మార్చింది. ఛత్తీస్గఢ్లో అమ్మకానికి వచ్చే ప్రతి మద్యం సీసాపై నాసిక్లో ముద్రించిన హోలోగ్రామ్ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
నకిలీ హోలోగ్రామ్ తయారీ అసాధ్యం
ప్రత్యేక విషయం ఏమిటంటే ఇది 7 లేయర్లతో (పొరలతో) నేరుగా తయారవుతుంది. అంటే ఈ హోలోగ్రామ్కు నకిలీ తయారు చేయడం సాధ్యం కాదు. ఎవరైనా నకిలీ హోలోగ్రామ్ తయారీ ప్రయత్నం చేస్తే సులభంగా పట్టుబడతారు. ఏడాదికి సుమారు 75 కోట్ల రూపాయలను హోలోగ్రామ్ తయారీకే ఖర్చవుతున్నాయి. అయితే ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించదు. ఛత్తీస్గఢ్లో బాట్లింగ్ పని చేసే సంస్థలు తమ ఆర్డర్ ప్రకారం ముందుగానే హోలోగ్రామ్ మొత్తం ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తాయి. ఆ తరువాత అదే మొత్తాన్ని ప్రభుత్వం నాసిక్ ముద్రణ సంస్థలకు చెల్లిస్తుంది.
టెండర్ వ్యవస్థ పూర్తిగా నిలిపివేత
గత సీఎం భూపేశ్ బఘేల్ ప్రభుత్వ హయాంలో హోలోగ్రామ్ కోసం టెండర్ ప్రక్రియ అమలులో ఉండేది. ఆ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగేవని ఆరోపణలు ఉన్నాయి. అధికారుల, రాజకీయ నేతల, వ్యాపారుల సిండికేట్ తమకు అనుకూలంగా ఉన్న సంస్థకే టెండర్ దక్కేలా చేసేది. ఈ కారణంతో తమ ఇష్టానుసారం నకిలీ హోలోగ్రామ్ అలాగే అసలైన హోలోగ్రామ్ ముద్రణ జరిపించేవారు. ఇప్పుడు ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు.
ఇప్పుడు ఛత్తీస్గఢ్ అబ్కారీ శాఖ నేరుగా కేంద్ర ప్రభుత్వ సంస్థకు హోలోగ్రామ్ ముద్రణ ఆర్డర్ ఇస్తోంది. ఎంత ముద్రణ అవసరమో అంత మొత్తానికే చెల్లింపు జరుగుతుంది. టెండర్ ప్రక్రియ లేదు, ఇతర సంస్థలతో చర్చ కూడా జరగదు.
భారతదేశంలో నోట్ల ముద్రణ కేవలం 4 ప్రాంతాల్లోనే జరుగుతుంది. నాసిక్, దేవాస్, మైసూర్, సాల్బోని ప్రాంతాల్లో నోట్ల ముద్రణ జరుగుతుంది. ఈ కేంద్రాల్లో భద్రత చాలా కఠినంగా ఉంటుంది. దేవాస్, నాసిక్ ముద్రణ కేంద్రాలు కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తాయి. మైసూర్, సాల్బోని కేంద్రాలను ఆర్బీఐ నిర్వహిస్తుంది.
