మహిళలకు ఉచిత బస్సు, రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. ఢిల్లీలో కాంగ్రెస్ తరఫున రేవంత్ హామీలు
ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇస్తున్నామని అన్నారు.

Delhi Elections 2025: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల హామీలను ప్రకటించారు. ఢిల్లీ పీసీసీ కార్యాలయం నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు తెలిపారు. సీఎంతో పాటు మీడియా సమావేశంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, సురేశ్ షెట్కార్, కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని ఢిల్లీ ప్రజలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భారత్ జోడో యాత్ర సమయంలో తెలంగాణ ఎన్నికల సమయంలో 5 గ్యారంటీలు హామీ ఇచ్చామని, వాటిని విజయవంతంగా అమలుచేసి చూపించామని చెప్పారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇస్తున్నామని అన్నారు.
“తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను చూసి, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. తెలంగాణలో ఒకేసారి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ జరగలేదు.
దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారింది. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ అన్నారు. 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇచ్చింది మాత్రం కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే. తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చాక 55 వేలకు పైగా ఉద్యోగాలను ఇచ్చాం. మహిళలకు ఉచిత బస్సు, రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
తెలంగాణ ఏర్పాటు హామీ ఇచ్చిన సోనియా గాంధీ, తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి చాలా నష్టం జరిగినా సరే.. హామీ నిలబెట్టుకున్నారు తప్ప వెనుకడుగు వేయలేదు. షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఢిల్లీలో అభివృద్ధి జరిగింది.. తప్ప ఆ తర్వాత పరిస్థితి ఎలాంటి దుస్థితికి చేరుకుందో చూడండి. ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.
ఇటు సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా మోదీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదని చెప్పారు. ఇద్దరూ కలిసి ఢిల్లీని నాశనం చేశారని, ఇద్దరూ వేరు కాదు.. ఒక్కటేనని తెలిపారు. ఢిల్లీని బాగుచేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణలో అమలు చేస్తున్న మాదిరిగానే ఢిల్లీలోనూ హామీలు అమలు చేస్తామని తెలిపారు. ఒక్క ఏడాదిలో తెలంగాణలో 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, స్వాతంత్ర్య భారతంలో ఇప్పటివరకు ఎవరూ ఇంతగా చేయలేదని తెలిపారు. మేము చేసి చూపించాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.