దేశంలో కరోనా రూపాంతరాలు ఎన్నో తెలుసా

India భారత్లో 5వేలకు పైనే కరోనా వైరస్ రూపాంతరాలు ఉన్నాయని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (CCMB)వెల్లడించింది. వీటిల్లో వేగంగా వ్యాప్తి చెందగల ఎన్–501–వై, నాశనం చేసేందుకు ఎక్కువ యాంటీబాడీలు అవసరమయ్యే ఈ–484–కేలు కూడా ఉన్నాయి.
ఏడాదిలోనే భారత్లో అన్ని రకాల రూపాంతరాలు ఎలా పరిణామం చెందాయన్న అంశాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో వివరించారు. గతేడాది జూన్ నాటికి దేశంలో కొంచెం నెమ్మదిగా వ్యాప్తి చెందుతుందనుకున్న ‘ఏ3ఐ’ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువచోట్ల ఉన్న ‘ఏ2ఏ’ రూపాంతరం వచ్చేసింది.
ఇటీవల వెలుగు చూసిన రూపాంతరాల్లో వైరస్ కొమ్ములోనే ఎక్కువ జన్యుమార్పులు చోటు చేసుకున్నట్లు శాస్త్రవేత్త డాక్టర్ దివ్య తేజ్ సౌపాటి తెలిపారు. దేశంలో గుర్తించిన కొన్ని రూపాంతర వైరస్లు పదేపదే వ్యాధికి కారణం అవుతున్నాయని తాము గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6,400 వైరస్ జన్యుక్రమాలు మాత్రమే నమోదై ఉన్నాయని, వీటిల్లోనే 5 వేల కంటే ఎక్కువ రూపాంతరాలు ఉన్నాయని అంచనా అని డాక్టర్ దివ్య తేజ్ సౌపాటి తెలిపారు.
కోవిడ్ బారిన పడ్డ వారిలో కనీసం 5 శాతం మందిలోని వైరస్ జన్యుక్రమాలను నమోదు చేసేందుకు కేంద్రం కార్యక్రమం చేపట్టిందని, ఇది వ్యాధి నియంత్రణ, చికిత్సల్లో కీలకం కానుందని డాక్టర్ సురభి శ్రీవాస్తవ తెలిపారు.
వైరస్ వ్యాప్తిని అర్థం చేసుకునేందుకు నిఘా ముమ్మరం చేయాలని, కొత్త రూపాంతరాలను వేగంగాగుర్తిస్తే అంతే వేగంగా చికిత్స పద్ధతులను అభివృద్ధి చేయొచ్చని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొన్ని రూపాంతర వైరస్లు కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని, ఎన్–440–కే రకం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు.