ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తోంది.. 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు?
లోక్సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం.

Lok Sabha Elections 2024 Notification: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దేశంలోని ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. అటు ఎన్నికల సంఘం కూడా ముమ్మర కసరత్తు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 15న నోటిఫికేషన్ అవకాశముందని తెలుస్తోంది. లోక్సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం కసరత్తు చివరి దశకు చేరిన నేపథ్యంలో పోలింగ్ తేదీలపై ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల సన్నద్ధతపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.. బుధవారం జమ్మూకాశ్మీర్ చేరుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. ఎన్సీ, పీడీపీ, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్, ఆప్ పార్టీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. రాజకీయ పార్టీలతో సమావేశం అనంతరం ఎన్నికల సంఘం అధికారులు, పోలీసు అధికారులతో ఆయన మాట్లాడనున్నారు.
లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు
దేశంలో 96.88 కోట్ల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. కొత్తగా 1.85 కోట్ల మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. జమ్మూకాశ్మీర్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా 2100 ఎన్నికల పరిశీలకులను నియమించిన సీఈసీ నియమించింది. వీరిలో 900 మంది జనరల్ అబ్జర్వర్లు, 450 మంది పోలీస్ అబ్జర్వర్లు, 800 మంది వ్యయ పరిశీలకులు ఉన్నారు.
Also Read: మిషన్ సౌత్.. 400 సీట్లు గెలిచేందుకు బీజేపీ వ్యూహం ఏంటి?
పరిశీలకులకు CEC దిశానిర్దేశం
స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, బెదిరింపులు, ప్రలోభాలు లేని ఎన్నికలు జరిగేలా చూడాలి
పరిశీలకులు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ నిష్పక్ష పాతంగా వ్యవహరించాలిఎన్నికల విధుల్లో కఠినంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి
పోలింగ్ కేంద్రాలను సందర్శించి భౌగోళిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి
సున్నిత ప్రాంతాలను పరిశీలించాలి
ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
తమకు కేటాయించిన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధికే పరిమితం కావాలి
పరిశీలకుల వాహనంలో జీపీఎస్ ట్రాకింగ్ను అమర్చాలి
తమ మొబైల్/ల్యాండ్లైన్ నంబర్లు/ఇమెయిల్ చిరునామాలు/బస చేసే స్థలాల గురించి విస్తృత ప్రచారం
పరిశీలకులు తమ ఫోన్లు/ఈ-మెయిల్స్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి
అభ్యర్థులు/రాజకీయ పార్టీలు/సాధారణ ప్రజానీకం/ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి అందుబాటులో ఉండాలి
డీఈఓలు చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులను లైజన్ ఆఫీసర్లుగా సెక్యూరిటీ ఆఫీసర్లుగా పరిశీలకులతో నియమించాలి
పోలింగ్ వేళల్లో, వీలైనన్ని ఎక్కువ పోలింగ్ కేంద్రాలను సందర్శించాలి
పోలింగ్ స్టేషన్లలోని పరిస్థితిని క్రమం తప్పకుండా అంచనా వేయాలి
పోలింగ్ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చూసుకోవాలి
కేంద్ర బలగాలు/రాష్ట్ర పోలీసు బలగాలు ఏ రాజకీయ పార్టీలు/అభ్యర్థులకు అనుకూలంగా ఉండకుండా చూసుకోవాలి
Also Read: సుప్రీంకోర్టు ఆదేశాలతో దిగొచ్చిన ఎస్బీఐ.. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు అందాయన్న కేంద్ర ఎన్నికల సంఘం