Maharashtra: మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా.. ఇప్పట్లో విస్తరణ లేనట్టేనట!
ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ కలయికలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మంత్రి వర్గ విస్తరణలో జాప్యం జరుగుతోంది. తొలుత ప్రభుత్వం ఏర్పడ్డ చాలా రోజులకు మంత్రివర్గ విస్తరణ చేశారు. అయితే అది పూర్తి స్థాయిలో జరగలేదు. రెండవ విడతలో మళ్లీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పటి నుంచి చెప్తూ వస్తున్నారు. కానీ అది జరగలేదు

Maharashtra cabinet expansion postponed once again
Maharashtra: తమకు మంత్రివర్గంలో అవకాశం దక్కేనా అని గంపెడు ఆశలతో ఎదురు చూస్తోన్న మహారాష్ట్ర ఎమ్మెల్యేలకు మరోసారి నిరాశే ఎదురైంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గత నెలలో ప్రకటించినప్పటికీ.. తాజాగా చేపట్టాల్సిన మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడింది. చాలా కాలంగా మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూస్తున్న ఎమ్మెల్యేలు.. పలుమార్లు నిరాశకు గురి అవుతుండడంతో రాజకీయ తిరుగుబాటు చేసే అవకాశం లేకపోలేదనే అంచనాలు వెలువడుతున్నాయి.
ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ కలయికలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మంత్రి వర్గ విస్తరణలో జాప్యం జరుగుతోంది. తొలుత ప్రభుత్వం ఏర్పడ్డ చాలా రోజులకు మంత్రివర్గ విస్తరణ చేశారు. అయితే అది పూర్తి స్థాయిలో జరగలేదు. రెండవ విడతలో మళ్లీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పటి నుంచి చెప్తూ వస్తున్నారు. కానీ అది జరగలేదు. గత నెలలో ఈ విషయమై దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రకటించారు.
అంతేనా.. అసెంబ్లీ కార్యకలాపాల నిర్వహణ కమిటీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసి తేదీ ప్రకటిస్తుందని వెల్లడించారు. డిసెంబర్ 5-9 తేదీల మధ్య కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా ప్రకటించారు. అయితే ఈ విషయమై ముఖ్యమంత్రి షిండే, ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ల మధ్య ఎలాంటి చర్చ జరగలేదని, పైగా బీజేపీ హైకమాండ్ నుంచి కూడా ఈ విషయమై ఎలాంటి స్పందన లేకపోవడంతో మంత్రివర్గ విస్తరణ ప్రస్తుతానికి అటకెక్కింది. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశమే లేదని కూడా వినిపిస్తోంది.