రాజ్యసభ నుంచి మన్మోహన్ సింగ్ రిటైర్.. 33 ఏళ్ల పాటు ఎంపీగా సేవలు

సుదీర్ఘ కాలం పాటు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించిన మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పదవీ విమరణ చేశారు.

రాజ్యసభ నుంచి మన్మోహన్ సింగ్ రిటైర్.. 33 ఏళ్ల పాటు ఎంపీగా సేవలు

Rajya Sabha: పలువురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం నేటితో ముగిసింగి. రాజ్యసభ నుంచి రిటైర్ అయిన 54 మందిలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. 33 ఏళ్ల పాటు ఆయన రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. ఆయన స్థానంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పెద్దల సభలో అడుగుపెడుతున్నారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, వైసీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్.. పదవీ కాలం కూడా నేటితో ముగిసింది.

నేడు, రేపు కొత్త సభ్యుల ప్రమాణం
కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు నేడు, రేపు పదవీ ప్రమాణం చేయనున్నారు. ఈరోజు 10 మంది కొత్త సభ్యులతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధ‌న్‌క‌ర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రేపు మరో 11 మంది సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీలు గురువారం ప్రమాణం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ తరపున గొల్ల బాబురావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి.. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభకు తాజాగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

Also Read: ఆప్‌ అగ్రనాయకత్వమంతా తీహార్ జైలులోనే.. ఈ నలుగురు వెళ్లింది అవినీతి కేసుల్లోనే..

మన్మోహన్ సింగ్‌కు ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఆయనకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం లేఖ రాశారు. దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను కొనియాడారు. మన్మోహన్ సింగ్ పదవీ విరమణతో దేశ రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలకు, యువతకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నప్పటికీ గళం వినిపిస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.