Corona Cases India : భారత్పై కరోనా భీకర దాడి..వరుసగా రెండో రోజూ 3లక్షలకు పైగా పాజిటివ్ కేసులు
భారత్పై కరోనా మహమ్మారి భీకర దాడి కొనసాగుతోంది. రోజుకో రికార్డును బద్దలుకొడుతూ ప్రపంచ రికార్డులను తిరగరాస్తోంది. వరుసగా రెండో రోజు కూడా రికార్డు స్థాయిలో 3లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

More Than 3 Lakh Corona Positive Cases For The Second Day In India
corona cases in India : భారత్పై కరోనా మహమ్మారి భీకర దాడి కొనసాగుతోంది. రోజుకో రికార్డును బద్దలుకొడుతూ ప్రపంచ రికార్డులను తిరగరాస్తోంది. వరుసగా రెండో రోజు కూడా రికార్డు స్థాయిలో 3లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 3లక్షల 32 వేల 730 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. అంటే రెండు రోజుల్లోనే దేశంలో ఆరు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో రెండు రోజుల్లో అత్యధికంగా 4 లక్షల కేసులు నమోదయ్యాయి. అటు మరణాల్లోనూ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వరుసగా మూడో రోజు కూడా 2 వేల మందికి పైగా కరోనాతో చనిపోయారు. గత 10 రోజుల్లో దేశవ్యాప్తంగా 15 వేల మంది కరోనాతో మరణించారు.
అటు దేశంలో కరోనా సెకండ్వేవ్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో విస్పోటనం సృష్టిస్తోంది. ఇక దేశంలో నెలకొన్న కరోనా సంక్షోభాన్ని ఆక్సిజన్ కొరత మరింత తీవ్రతరం చేస్తోంది. ప్రాణవాయువు దొరక్క ఆక్సిజన్ అవసరం ఉన్న అన్ని రకాల రోగులు అల్లాడుతున్నారు. మెడికల్ ఆక్సిజన్ను వెంటనే పంపాలంటూ వివిధ రాష్ర్టాల సీఎంలు, మంత్రులు, ఇతర నేతలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆక్సిజన్ కోసం కేంద్రం కాళ్లు కూడా పట్టుకోవడానికి సిద్ధమేనని మహారాష్ట్ర హోంమంత్రి రాజేశ్ తోపే చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 67 వేల13 కరోనా పాజిటివ్ నమోదయ్యాయి. కరోనాతో 568 మంది మృతి చెందారు. కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోన్న కాని ఉపయోగం కనిపించడంలేదు.
అటు ఉత్తరప్రదేశ్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్కరోజులోనే 34 వేల 379 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 195 మంది చనిపోయారు. ఢిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు నిండుకొన్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో కేంద్రం ఢిల్లీకి ఆక్సిజన్ను సరఫరా చేసినప్పటికీ చిన్నచిన్న హాస్పిటల్స్కు ఆక్సిజన్ చేరలేదు. సప్లయర్లు ఫోన్లు తీయడం లేదని ఆస్పత్రి యాజమానులు ఆరోపిస్తున్నారు. ఇక ఢిల్లీలో ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 26 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 306 మంది చనిపోయారు.
ఇటు దక్షిణాది రాష్ట్రాలు కేరళ, కర్ణాటకలో పరిస్థితి మరింత దారుణంగా తయారువుతోంది. రెండు రోజుల క్రితమే 20 వేల పాజిటివ్ కేసులు నమోదైన ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇప్పుడు 25 వేలు దాటేశాయి. నిన్నటిదాకా కర్నాటక తర్వాత స్థానంలో ఉన్న కేరళ ఒక్క సారిగా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ తర్వాత స్థానంలోకి చేరింది. అక్కడ ఒక్కరోజులో దాదాపు 27 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కర్ణాటకలో 24గంటల్లో 25 వేల 795 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే దక్షిణాది రాష్ట్రలు కరోనాకు హాట్ స్పాట్గా మారడం ఖయంగా కనిపిస్తోంది.