టిక్‌టాక్ యాప్‌ బ్యాన్ వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

  • Published By: vamsi ,Published On : June 22, 2020 / 02:05 AM IST
టిక్‌టాక్ యాప్‌ బ్యాన్ వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

Updated On : June 22, 2020 / 2:05 AM IST

భారతదేశం మరియు చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన క్రమంలో చైనా యాప్‌లను ప్రభుత్వం నిషేధిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా టిక్‌టాక్ బ్యాన్ వార్తలు వేగంగా విస్తరించాయి. ఈ వార్తలపై ఇండియన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టత ఇచ్చింది. టిక్‌టాక్ కానీ, ఇతర చైనీస్ యాప్‌లను బ్యాన్ చేస్తున్నట్లుగా వచ్చిన వార్త పూర్తిగా తప్పుడు వార్త అంటూ ప్రకటించింది.

చైనాకు చెందిన కొన్ని మొబైల్ యాప్స్‌ పనితీరును పరిమితం చేయాలంటూ టెక్ కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా చెబుతున్న ఉత్తర్వులు తప్పు అని స్పష్టత ఇచ్చింది భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. 

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) జారీ చేసినట్టుగా ప్రచారం అవుతున్న ఈ ఉత్తర్వుల్లో.. చైనాకు చెందిన టిక్‌టాక్, లైవ్‌మి, బిగో లైవ్, విగో వీడియో, బ్యూటీ ప్లస్, కేమ్ స్కానర్, క్లాష్ ఆఫ్ కింగ్స్, మొబైల్ లెజెండ్స్, క్లబ్ ఫ్యాక్టరీ, షీన్, రోమ్‌వే, యాప్ లాక్, వీమేట్ వంటి 13 యాప్‌లను నిషేధిస్తున్నట్టు ఉంది.

అయితే, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ ఉత్తర్వు నకిలీదని పీఐబీ చెప్పింది. దీనిని నమ్మొద్దని, ప్రభుత్వం నుంచి అలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదని స్పష్టం చేసింది. గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో ఈ యాప్‌లపై ప్రభుత్వం నిషేధం విధించడం లేదు.

Read:  కరోనాకు హైదరాబాద్ ఇంజెక్షన్ రెడీ.. మార్కెట్ లోకి కోవిఫర్