Indian Railway: రైలు బెర్త్ కోసం ఇక వెయిటింగ్ ఉండదు.. రైల్వేల్లో తీసుకొస్తున్న కొత్త మార్పేంటో తెలుసుకోండి
నాన్-ఏసీ కోచ్లతో బెర్త్ల కొరత ఉందన్న నివేదికలను తోసిపుచ్చిన వైష్ణవ్, గత ఏడాదితో పోలిస్తే ఈ పండుగ సీజన్లో ప్రత్యేక రైళ్ల సంఖ్యను దాదాపు మూడు రెట్లు పెంచినట్లు చెప్పారు.

జనాభా పెరుగుతున్నందున వచ్చే నాలుగు-ఐదేళ్లలో 3,000 కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. దీనికి తగ్గట్టుగా మరిన్ని రైళ్లు అవసరం. దీంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2027 నాటికి కొత్త రైళ్లను ప్రవేశపెడితే టికెట్ల వెయిటింగ్ కష్టాలు తీరి అందరికీ కన్ఫర్మ్ టిక్కెట్లు లభిస్తాయన్నారు.
రానున్న ఐదేళ్లలో డిమాండ్కు అనుగుణంగా ట్రాక్పై రైళ్ల సంఖ్యను పెంచాలని రైల్వే భావిస్తోంది. ప్రస్తుతం రైల్వేలో ప్రయాణీకుల సామర్థ్యం ఏటా 800 కోట్లుగా ఉందని, ఐదేళ్లలో దీనిని 1,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రైల్వే వర్గాల సమాచారం ప్రకారం 69,000 కొత్త కోచ్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 5,000 కొత్త కోచ్లను తయారు చేస్తున్నారు. ఇక 400 నుంచి 450 వందే భారత్ రైళ్లతో పాటు ప్రతి సంవత్సరం 200 నుంచి 250 జతల కొత్త రైళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. దీని కోసం లక్ష కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించినట్లు కేంద్ర రైల్వే మంత్రి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: సర్పంచ్ నుంచి సీఎంగా.. గెలిచిన మొదటిసారే పెద్ద పదవి.. రాజస్థాన్ కొత్త సీఎం విశేషాలివి
నాన్-ఏసీ కోచ్లతో బెర్త్ల కొరత ఉందన్న నివేదికలను తోసిపుచ్చిన వైష్ణవ్, గత ఏడాదితో పోలిస్తే ఈ పండుగ సీజన్లో ప్రత్యేక రైళ్ల సంఖ్యను దాదాపు మూడు రెట్లు పెంచినట్లు చెప్పారు. ఈ పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 6,754 అదనపు రైళ్లు నడపబడగా, గత ఏడాది ఇదే కాలంలో 2,614 రైళ్లు నడిపారు. పండుగ సీజన్ ప్రారంభానికి మూడు నెలల ముందు రిజర్వేషన్లు, వెయిటింగ్ జాబితాను అధ్యయనం చేస్తామని కేంద్ర మంత్రి అన్నారు.