Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు..
పహల్గాం లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకార చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది.

Operation Sindoor
Operation Sindoor: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది. మంగళవారం అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారతసైన్యం మెరుపుదాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాకిస్థాన్ ఆక్రమి కశ్మీర్ తోపాటు పాకిస్థాన్ లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి.
భారత సాయుధ దళాలు పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకొని ‘ఆపరేషన్ సిందూర్’ ను ప్రారంభించాయి. అక్కడి నుండే భారతదేశంపై ఉగ్రవవాద దాడుల ప్లాన్ చేయడం జరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మొత్తం తొమ్మిది ప్రాంతాల్లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది.
‘ఆపరేషన్ సిందూర్’ పై భారత్ కీలక ప్రకటన..
భారత హొం మంత్రిత్వ శాఖ ‘ఆపరేషన్ సిందూర్’ పై ప్రకటనలో మొత్తం తొమ్మిది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మా చర్యలు కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే కేంద్రీకృతమై ఉన్నాయని తెలిపింది. పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని, లక్ష్యాలను ఎంచుకోవడంలో భారతదేశం చాలా సంయమనం పాటించిందని ప్రకటించింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 25మంది భారతీయులు, ఒక నేపాలీ జాతీయుడు మరణించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
ఆపరేషన్ సిందూర్ పై ఇండియన్ ఆర్మీ స్పందించింది. న్యాయం జరిగింది అని ఎక్స్ లో పోస్టు చేసింది. అయితే దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను భారత ఆర్మీ ఇంకా వెల్లడించలేదు. మరోవైపు భారత్ లోని శ్రీనగర్, జమ్ము, అమృత్ సర్, ధర్మశాల లేహ్ విమానాశ్రయాలను మూసివేసినట్లు సమాచారం.
Justice is Served.
Jai Hind! pic.twitter.com/Aruatj6OfA
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 6, 2025
తొమ్మిది ప్రాంతాల్లో దాడులు..
ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం దాడి చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఐదు, పాకిస్థాన్ ప్రాంతంలోని నాలుగు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. సియాల్ కోట్, బహావల్ పూర్, చాక్రా, ముజుఫర్ పూర్, కోట్లీ బంబీర్, చాక్రాఆమ్రూలో జరిగిన దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.