హాస్పిటల్ నుంచి మమత వీడియో రిలీజ్

హాస్పిటల్ నుంచి మమత వీడియో రిలీజ్

Updated On : March 11, 2021 / 3:37 PM IST

mamata బుధవారం సాయంత్రం నందిగ్రామ్ లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తున్న సమయంలో జరిగిన తోపులాటలో గాయపడి కోల్ కతాలోని ఎస్ఎస్కేఎమ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..హాస్పిటల్ నుంచి తృణముల్ పార్టీ కార్యకర్తలకు సందేశమిచ్చారు. ఈ మేరకు మమత ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను నిన్న సాయంత్రం కారు దగ్గర నిలబడి ఉన్నప్పుడు తనను కొందరు తోసేయడం జరిగిందని మమత ఆ వీడియోలో తెలిపారు. దాడి సమయంలో తన చుట్టూ భద్రతా సిబ్బంది ఎవరూ లేరని మమత తెలిపారు.

తన కాలు నలిగిపోయిందని మమత తెలిపారు. ఛాతి భాగంలో చిన్న చిన్న గాయాలున్నాయని తెలిపారు. ఎడమ కాలి మడియ భాగంలో నొప్పిగా ఉందన్నారు. తీవ్రమైన తలనొప్పి,గుండెలో కాస్త పెయిన్ గా ఉందన్నారు. టీఎంసీ కార్యకర్తలందరూ సంయమనం పాటించాలని మమత పిలుపునిచ్చారు. ఏ ఒక్కరికీ అసౌకర్యం కలిగేలా ఎలాంటి పనులు చేయవద్దని సూచించారు. తాను రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ పని ప్రారంభిస్తాను అని ఆమె తెలిపారు. కొన్ని రోజుల పాటు తాను వీల్ చైర్ ఉపయోగించాల్సి ఉంటుందని ామె తెలిపారు.

మరోవైపు,టీఎంసీ నాయకులు మమతను పరామర్శించేందుకు ఆమె చికిత్స పొందుతున్న ఎస్ఎస్ కేఎమ్ హాస్పిటల్ కు వెళ్తున్నారు. టీఎంసీ నేతలు నుశ్రత్ జహాన్,మిమి చక్రవర్తి,మదన్ మిశ్రా కొద్దిసేపటి క్రితం మమతని పరామర్శించారు.