Shehbaz Sharif : పాక్ ప్రధానికి పీఎం మోదీ విషెస్
పాకిస్థాన్ నూతన ప్రధాని PML(N) అధ్యక్షులు షెహబాజ్ షరీఫ్ (70) కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియచేశారు...

Modi
PM Modi Wishes Pakistan PM : పాకిస్థాన్ నూతన ప్రధాని PML(N) అధ్యక్షులు షెహబాజ్ షరీఫ్ (70) కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియచేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. పాక్ ప్రధానిగా ఎన్నికైన మియాన్ ముహమ్మద్ షెహ్ బాజ్ షరీఫ్ అభినందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. భారత్ దేశం ఎల్లప్పటికీ శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటుందని, దేశం అభివృధ్ధి చెందే దిశలో రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుందన్నారు. భారతదేశం శాంతి కాముక దేశమని, ఉగ్రవాదం లేని ప్రాంతంలో మనం అభివృద్ధి సవాళ్లపై దృష్టి సారించవచ్చన్నారు. ఇది మన ప్రజలకు ఎంతో శ్రేయస్కరమని తెలిపారు.
పాకిస్థాన్ లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ వ్యతిరేక కూటమిలోని ప్రతిపక్షాలన్నీ పాకిస్థాన్ ప్రధానిగా పీఎంఎల్(ఎన్) అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ను ప్రతిపాదించిన విషయం విదితమే. ఈ క్రమంలో పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సోమవారం మధ్యాహ్నం 2గంటలకు ప్రత్యేక సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో నూతన ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ఎన్నిక లాంఛనమైంది.
మరోవైపు… పాకిస్తాన్ లో రాజకీయ పరిణామాలు మారినవేళ..భారత ఆర్మీ కమాండర్ సరిహద్దుల వెంట పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం కాశ్మీర్ లోయను సందర్శించిన నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, పర్యటనలో భాగంగా సోమవారం నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి భద్రతా పరిస్థితిని సమీక్షించారు. సరిహద్దులోని ఫార్వర్డ్ ప్రదేశాలకు వెళ్లిన ఆయన ఫార్మేషన్ లు మరియు యూనిట్ లను సందర్శించారు.
Congratulations to H. E. Mian Muhammad Shehbaz Sharif on his election as the Prime Minister of Pakistan. India desires peace and stability in a region free of terror, so that we can focus on our development challenges and ensure the well-being and prosperity of our people.
— Narendra Modi (@narendramodi) April 11, 2022