SSC CHSL 2026 : ఇంటర్ పాసైతే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీకోసమే.. 2,536 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
SSC CHSL 2026 Notification : ఇంటర్ పూర్తిచేసి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్న వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) శుభవార్త చెప్పింది.
SSC Chsl 2026 Notification
SSC CHSL 2026 Notification : ఇంటర్ పూర్తిచేసి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్న వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) శుభవార్త చెప్పింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ (CHSL) 2026 నోటిఫికేషన్ను సెప్టెంబర్ 7న విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 2,536 తాత్కాలిక ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ), డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ)/డీఈఓ గ్రేడ్ ‘ఏ’ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Also Read : TGLPRB Recruitment 2026 : నిరుద్యోగులకు శుభవార్త.. పోలీస్ ఉద్యోగాలకు మరో అవకాశం.. దరఖాస్తు గడువు పొడిగింపు
దరఖాస్తు తేదీలు ఇవే..
ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. అభ్యర్థులు అక్టోబర్ 7వ తేదీ రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు అక్టోబర్ 8 రాత్రి 11 గంటల వరకు అవకాశం ఉంటుంది. దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు అక్టోబర్ 14 నుంచి 16 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది.
విద్యార్హతలు..
డీఈఓ/ డీఈఓ గ్రేడ్ ‘ఎ’ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ స్ట్రీమ్లో గణితం ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ లేదంటే 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 12వ తరగతి పరీక్షలకు హాజరైన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత వయసు ..
2026, ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే అభ్యర్థులు 1999, ఆగస్టు 2 నుంచి 2008, ఆగస్టు 1 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తుల విధానం ఇలా..
దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. దరఖాస్తు ఫీజు వివరాలను పరిశీలిస్తే.. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు. టైర్-1, టైర్-II రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ssc.gov.inను సందర్శించండి.
పరీక్ష ఎప్పుడు?
టైర్-I, టైర్-II రాత పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ రెండు కంప్యూటర్ ఆధారిత పరీక్షల తేదీలను SSC ఇంకా ప్రకటించలేదు. పరీక్ష తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు కమిషన్ తెలిపింది. అయితే, టైర్-1 ఎగ్జామినేషన్ ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్లో ప్రశ్నలు మల్టీపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి. 100 ప్రశ్నలు ఇస్తారు. 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాల్లో పూర్తిచేయలి. టైర్ -II పరీక్షను ఒకేరోజులో రెండు వేర్వేరు సెషన్లలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొత్తం (సెక్షన్ -1, సెక్షన్-2, సెక్షన్ -3, సెక్షన్-4) నాలుగు విభాగాలు ఉంటాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే అభ్యర్థులు అన్ని విభాగాల్లోనూ తప్పనిసరిగా అర్హత సాధించాలి. అలాగే సెక్షన్ -1, సెక్షన్ -IIలకు నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పునకు ఒక మార్కు చొప్పున కోత ఉంటుంది.
