Punjabi AI Robot: వావ్.. మాట్లాడగలదు, బాంబులను నిర్వీర్యం చేయగలదు.. జస్ట్ 20వేలతో ఏఐ రోబో తయారు చేసిన స్కూల్ విద్యార్థులు..
6వ క్లాస్ నుంచి 12వ క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఏఐ ఆధారంగా స్కూల్ లోని ల్యాబ్లో ఈ రోబోను తయారు చేశారు. దీనికి తలపాగ పెట్టి పంజాబీ లుక్ తీసుకొచ్చారు.
Punjabi Robot: ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ (ఏఐ) హవా నడుస్తోంది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం పెరిగింది. ఈ అత్యాధునిక సాంకేతికత ద్వారా అద్భుతాలు ఆవిష్కారం అవుతున్నాయి. తాజాగా పంజాబ్లోని ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ఏఐని ఉపయోగించి అద్భుత ఆవిష్కరణ చేశారు. దేశంలోనే తొలి సిక్కు రోబోను తయారు చేశారు. దీని తయారీకి కేవలం 20వేలు ఖర్చు అయ్యింది. అధునాతన టెక్నాలజీ ఏఐ ఇంటి పనులకు కూడా ఉపయోగపడేలా ఈ రోబోను తయారు చేశారు.
మానసా జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు దీన్ని తయారు చేశారు. ఈ రోబోకు జాన్ జీ అని పేరు పెట్టారు. 6వ క్లాస్ నుంచి 12వ క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఏఐ ఆధారంగా స్కూల్ లోని ల్యాబ్లో ఈ రోబోను తయారు చేశారు. దీనికి తలపాగ పెట్టి పంజాబీ లుక్ తీసుకొచ్చారు.
రోబో ప్రత్యేకతలు ఇవే..
* మాట్లాడగలదు
* ఇది పర్వత ప్రాంతాలకు కూడా వెళ్లగలదు, ఎత్తైన కొండలు ఎక్కగలదు.
* బాంబులను నిర్వీర్యం చేయగలదు.
* మంటలను అదుపు చేసే శక్తి కూడా ఉంది.
* ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈజీగా కదలగలదు.
* వర్షం పడినప్పుడు బయట ఆరబెట్టిన దుస్తులను తీసి లోపల పెట్టగలదు.
* ఇంట్లోని ఫ్యాన్లను ఆపగలదు.
* ఈ రోబో ప్రతి అంశాన్ని అర్థం చేసుకుని స్పందించగలదు.
* విద్యార్థులు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తుంది.
* దేశ ప్రధాని, పంజాబ్ సీఎం గురించి అడిగే ప్రశ్నలకు కూడా సమాచారం ఇస్తుంది.
ఈ రోబో తయారీ వెనుక ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులకు తగిన సమాచారం అందించడమే అని రోబో తయారీలో విద్యార్థులకు సాయపడిన టీచర్ అన్నారు. అలాగే ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు మొదట ఈ రోబో గ్యాస్ను ఆపివేసి, ఆపై మంటలను ఆర్పివేస్తుందన్నారు. భవిష్యత్తుల్లో ఈ రోబోపై మరింత పని చేస్తామన్నారు. ఈ రోబోకు పలు సెన్సార్లు కూడా ఉన్నాయని, ఏ పనైనా చాలా ఈజీగా చేస్తుందని టీచర్ తెలిపారు.
ఈ రోబో బ్యాటరీ సాయంతో నడుస్తుందని, 3 నెలల క్రితం ప్రయోగం ప్రారంభమైందని విద్యార్థులు తెలిపారు. ఖర్చు మొత్తం స్కూల్ యాజమాన్యం భరించిందన్నారు. ఇంటి పనులు కూడా చేసే విధంగా ఏఐ టెక్నాలజీతో రోబోను తయారు చేసినట్లు విద్యార్థులు వివరించారు. ఈ రోబోను ఇంటి పనులకు కూడా ఉపయోగించవచ్చని స్టూడెంట్స్ తెలిపారు.
