నా కొడుకుని చొక్కా పట్టుకుని నిలదీయండి
ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా,నియోజకవర్గ అభివృద్ధికి పనిచేయకుంటే తన కుమారుడిని చొక్కా పట్టుకు నిలదీయాలని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ అన్నారు. మధ్యప్రదేశ్ లోని చింద్వారా లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కమల్ నాథ్ కుమారుడు నకుల్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న కుమారుడి తరపున శనివారం(ఏప్రిల్-20,2019) ధనోరా గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న కమల్ నాథ్ ఈ మాటలు అన్నారు.
నాలుగు దశాబ్దాలుగా చింద్వారా ప్రజలు పంచిన ప్రేమ, ఆప్యాయతలతోనే తాను ఈస్ధాయికి ఎదిగానని, ఈ బాధ్యతలను ఇప్పుడు తన కుమారుడు నకుల్ కు అప్పగిస్తున్నానని కమల్ నాథ్ స్ధానికులతో చెప్పారు.చింద్వారా లోక్సభ స్థానం నుంచి కమల్ నాథ్ తొమ్మిదిసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. సీఎం కమల్నాధ్ చింద్వారా అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.తన కృషి కారణంగానే చింద్వారా డిస్ట్రిక్ట్ కు డిస్టిన్క్ట్ ఐడెంటెటీ వచ్చిందని కమల్ నాథ్ అన్నారు. ప్రధాని మోడీ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ లు ప్రజల్ని మభ్యపెట్టడం మినహా చేసిందేమీ లేదన్నారు.ఏప్రిల్-28,2019న చింద్వారా లోక్ సభ స్థానంతో పాటు అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరుగనుంది.