Gujarat : బెయిల్ వచ్చినా 3 ఏళ్లుగా అతను జైల్లోనే.. ఈమెయిల్ చూడని అధికారులకు కోర్టు జరిమానా..
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదనే సామెత వినే ఉంటారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా జైలు అధికారులు మాత్రం అతడిని 3 ఏళ్లు జైల్లోనే ఉంచారు. అందుకు కారణం ఏంటో చదవండి.

Gujarat
Gujarat : గుజరాత్లోని ఓ జైలు అధికారులు ఈ-మెయిల్లో వచ్చిన బెయిల్ ఆర్డర్ చూడకపోవడంతో ఓ వ్యక్తి 3 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది. దీంతో గుజరాత్ హైకోర్టు సీరియస్ అయ్యింది. అతడికి నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
27 ఏళ్ల చందంజీ ఠాకోర్ అనే వ్యక్తి ఓ హత్య కేసులో గుజరాత్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అతనికి సెప్టెంబర్ 29, 2020 న హైకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఆర్డర్ కాపీని ఈ-మెయిల్ చేసింది. దీనిని మూడేళ్లు కావస్తున్నా జైలు అధికారులు ఓపెన్ చేసి చూడలేదు. తాజాగా దోషి బెయిల్ కోసం మళ్లీ దరఖాస్తు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బెయిల్ ఆర్డర్ను జైలు అధికారులు తెరవకపోవడంతో గుజరాత్ హైకోర్టు అధికారులపై సీరియస్ అయ్యింది. దోషి అదనంగా మూడేళ్లు జైలు శిక్షను అనుభవించడానికి కారణమవ్వడంతో అతనికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని.. 14 రోజుల వ్యవధిలో ఆ మొత్తం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఏఎస్ సుపెహియా, జస్టిస్ ఎంఆర్ మెంగ్డేలతో కూడిన డివిజన్ బెంచ్ దోషికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ED Cese On Prajapati : ఉద్యోగాల పేరుతో రూ.720 కోట్లు దోపిడీ .. గుజరాత్కు చెందిన ప్రజాపతిపై ఈడీ కేసు
కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ కేసులో అవసరమైన చర్యలు తీసుకోలేకపోయామని జైలు అధికారులు చెప్పారు. అందువల్ల మెయిల్తో కూడిన అటాచ్ మెంట్ తెరవలేకపోయినట్లు వివరణ ఇచ్చారు. ఈ కేసును తీవ్ర పరిగణనలోకి తీసుకున్న గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరైన ఖైదీల వివరాలను సేకరించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA) లను ఆదేశించింది.