WAQF Bill: రాజ్యసభలోనూ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. చట్టంగా మారడానికి ఒక్క అడుగు దూరంలో..
దేశవ్యాప్తంగా విస్తృత చర్చతోపాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 రాజ్యసభలోనూ ఆమోదం పొందింది.

Union Minority Affairs Minister Kiren Rijiju
WAQF Bill Passed: దేశవ్యాప్తంగా విస్తృత చర్చతోపాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 పార్లమెంట్ లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. తాజాగా.. రాజ్యసభలోనూ ఈ బిల్లుకు ఆమోదం లభించింది. గురువారం అర్థరాత్రి దాటే వరకు రాజ్యసభలో ఈ బిల్లుపై విస్తృత చర్చ జరిగింది.
దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్ కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. దీంతో రాజ్యసభలోనూ వక్ఫ్ (సవరణ) బిల్లు -2025 ఆమోదం పొందింది. వక్ఫ్ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం బిల్లు చట్టంగా రూపుదాల్చుతుంది.
ఉమీద్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్ మెంట్, ఎఫీషియన్సీ అండ్ డెవలప్మెంట్)గా పేరు మార్చిన వక్ఫ్ (సవరణ) బిల్లు -2025ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. బిల్లు రాజ్యాంగ విరుద్ధం, ముస్లింల భూములను లాక్కోవడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం అంటూ ఆరోపించారు. విపక్షాల వాదనలను రిజిజు ఖండించారు. ముస్లింల హక్కులను ఎవరూ లాక్కోబోవడం లేదు.. ఈ విషయమై విపక్షాల దుష్ప్రచారం చేయడం మంచిది కాదంటూ చెప్పారు.
రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై చర్చ పూర్తయిన తరువాత మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు ఒక చట్టబద్దమైన సంస్థ, అది లౌకికమైనదిగా ఉండాలని అన్నారు. ఈ బిల్లు వల్ల ఒక్క ముస్లిం కూడా నష్టపోరు. కోట్లాది మంది ముస్లింలు ప్రయోజనం పొందబోతున్నారని చెప్పారు.