Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం.. ఇందులో మానవ తప్పిదం ఉందా? నిపుణుల మాటేమిటి..
గాల్లోకి ఎగిరిన కాసేపటికే అది నేలకూలింది. విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం.. ఇందులో మానవ తప్పిదం ఉందా? నిపుణుల మాటేమిటి..
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాలకే నేలకూలింది. 242 మంది ప్రయాణికులతో ఉన్న ఆ విమానం ఎయిర్ పోర్టు సమీపంలోని మేఘానీనగర్ లో ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఏటీసీ ప్రకారం గురువారం(జూన్ 12) మధ్యాహ్నం 1.39 గంటలకు విమానం టేకాఫ్ అయ్యింది. వెంటనే ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వెళ్లింది. ఆ వెంటనే ఏటీసీ సంప్రదించినా విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఎయిర్ పోర్ట్ బయట ఫ్లైట్ కుప్పకూలింది. గాల్లోకి ఎగిరిన కాసేపటికే అది నేలకూలింది. విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మంటలు చెలరేగడంతో ఎవరినీ కాపాడే పరిస్థితి లేకపోయింది. కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం.. బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్. ఇది అమెరికాలో తయారైంది.
అసలు ఈ ఘోర ప్రమాదం ఎలా జరిగింది? విమానం నేలకూలడానికి కారణం ఏంటి? టేకాఫ్ అయిన కాసేపటికే ఎందుకు కుప్పకూలింది? అసలేం జరిగింది? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ ప్రమాదంలో మానవ తప్పిదం ఏమైనా ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విమానయాన నిపుణులు స్పందించారు. వాళ్లు తమ తమ అభిప్రాయాలు తెలిపారు. ఒక్కొక్కరు ఒక్కో కారణాన్ని వెల్లడించారు. అలా జరిగి ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. విమానం టేకాఫ్ సమయంలో వింగ్ ఫ్లాప్లు సమస్యగా ఉండొచ్చని విమానయాన నిపుణుడు ఒకు చెప్పారు. ”విమాన చక్రాలు ఇంకా బయట ఉన్నాయి, కానీ ఫ్లాప్లు లోపలికి వెళ్లాయి” అని మరొక నిపుణుడు చెప్పారు. ”ఇది వింతగా ఉంది. ఎందుకంటే విమానం పైకి లేవడానికి సాయం కోసం ఫ్లాప్లను సాధారణంగా టేకాఫ్ తర్వాత కొంత సమయం పాటు బయట ఉంచుతారు” అని ఆయన అన్నారు.
”చక్రాలు సాధారణంగా 10 నుంచి 15 సెకన్ల తర్వాత లోపలికి వెళ్తాయి. తర్వాత 10 నుంచి 15 నిమిషాలలో ఫ్లాప్లను నెమ్మదిగా లోపలికి లాగుతారు. వీడియోను చూసి చెప్పడం కష్టం, కానీ ఫ్లాప్లు విచ్చుకుని ఉన్నట్లు కనిపించడం లేదు. విమానం సరిగ్గా టేకాఫ్ కాలేకపోవడానికి అదే కారణం కావచ్చు. ఫ్లాప్లను సరిగ్గా సెట్ చేయకపోతే, అది మానవ తప్పిదం కావచ్చు. కానీ, వీడియో దానిని నిరూపించేంత స్పష్టంగా లేదు” అని విమానయాన నిపుణులు తమ అభిప్రాయాలను తెలిపారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తులో సాయం చేసేందుకు యూకే నుంచి అధికారులు భారత్ వస్తున్నారు. ఇండియాలోని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు సాయం చేయడానికి సిద్ధమని వారు ప్రకటించారు. అటు అమెరికా దర్యాప్తు అధికారులు కూడా భారత్ రానున్నారు.