భారత్ దెబ్బతో బిత్తరపోయిన చైనా…LACపై త్రివిధ దళాధిపతి క్లారిటీ

  • Published By: venkaiahnaidu ,Published On : November 6, 2020 / 01:28 PM IST
భారత్ దెబ్బతో బిత్తరపోయిన చైనా…LACపై త్రివిధ దళాధిపతి క్లారిటీ

Updated On : November 6, 2020 / 2:36 PM IST

CDS Bipin Rawat talks tough on Ladakh standoff లడఖ్ సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. సరిహద్దు ఘర్షణలు అతిపెద్ద సైనిక చర్యలకు దారితీసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఓ వర్చువల్ సెమినార్​లో ప్రసంగం సందర్భంగా వ్యాఖ్యానించారు.



బోర్డర్ లో చైనా దుశ్చర్యలకు భారత సైన్యం దీటుగా బదులిచ్చిన తర్వాత ఆ దేశానికి ఏం చేయాలో తెలియడం లేదని చెప్పారు. సరిహద్దులో పూర్వ స్థితిని మార్చాలని చూస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు.

నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న పాకిస్తాన్ కు ఈ సందర్భంగా రావత్​ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. భారత వ్యతిరేక శక్తులకు వత్తాసు పలుకుతూ జమ్ముకశ్మీర్​లో యుద్ధవాతావరణం సృష్టించాలని చూస్తున్నందుకే పాక్ తో సంబంధాలు అట్టడుగుకు చేరాయన్నారు. భారత్​ నిర్వహించిన లక్షిత దాడులు, బాలాకోట్ దాడులు ఉగ్రవాదులను ఉసిగొల్పాలని చూస్తున్న పాకిస్థాన్​కు గట్టి సందేశమని రావత్​ స్పష్టం చేశారు.



సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ అనుసరిస్తున్న నూతన పంథాతో పాక్​లో అనిశ్చితి నెలకొందని తెలిపారు. భారత్​ ఎదిగే కొద్దీ భద్రతా సవాళ్లు ఎదురవుతాయని, అందుకే సైనిక అవసరాలకు ఇతర దేశాలపై ఆధార పడకుండా స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని రావత్​ పేర్కొన్నారు. అణ్వాయుధాలు గల రెండు పొరుగు దేశాలైన చైనా,పాక్ వ్యూహాత్మక ప్రాంతీయ అస్థిరతకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు.