ఏపీ తొలి మహిళా సీఎస్ గా నీలం సాహ్ని

  • Published By: veegamteam ,Published On : November 14, 2019 / 02:25 AM IST
ఏపీ తొలి మహిళా సీఎస్ గా నీలం సాహ్ని

Updated On : November 14, 2019 / 2:25 AM IST

ఏపీకి కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చారు. ఏపీ సీఎస్ గా నీలం సాహ్నిని నియమిస్తూ.. జగన్ ప్రభుత్వం బుధవారం(నవంబర్ 13,2019) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల క్రితమే నీలం సాహ్ని కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన సంగతి తెలిసిందే.

ఎన్నికల సమయంలో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఇటీవలే బదిలీ చేసిన జగన్ ప్రభుత్వం.. ఆయన స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో కొత్త సీఎస్ గా నీలం సాహ్నిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్ ప్రకాష్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సాహ్ని ఉమ్మడి ఏపీలో.. మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా విధులు నిర్వహించారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పని చేసిన సాహ్ని.. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశాక.. ఎపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.

2018 నుంచి ఇటీవలి వరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత కార్యదర్శిగా నీలం సాహ్ని విధులు నిర్వహించారు. ఏపీ సీఎస్ గా గురువారం(నవంబర్ 14,2019) బాధ్యతలు చేపడతారు. ఉమ్మడి ఏపీలో సతీనాయర్, మిన్నీ మాథ్యూ మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు.

నీలం సాహ్ని 2020 జూన్ నెలాఖరు వరకు సర్వీస్ లో ఉండనున్నారు. నవ్యాంధ్ర తొలి మహిళా సీఎస్ నీలం సాహ్ని కావడం విశేషం. నీలం సాహ్ని ఇటీవలే ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. నవంబర్ 4న విజయసాయిరెడ్డితో కలిసి తాడేపల్లిలో జగన్‌ను కలిసిన ఆమె.. సీఎంతో కలిసి లంచ్ చేశారని తెలుస్తోంది. ఆ తర్వాతే ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. కాగా, ఎల్వీ సుబ్రహ్మణ్యం సడెన్ బదిలీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.