Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకున్న దిగ్విజయ్ సింగ్
24 ఏళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. 1998లో ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టిన అనంతరం నాటి నుంచి ఈ ఎన్నిక జరగలేదు. 2017లో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడు చేసినప్పటికీ.. ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా జరిగిపోయింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన రాజీనామా చేశారు

Digvijay Singh not to contest Congress Presidential Election
Congress President Election: నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికపై అమితాసక్తి చూపిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉన్నట్టుండి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు బుధవారం ప్రకటించిన ఆయన.. కేవలం రెండు రోజుల్లోనే నిర్ణయాన్ని మార్చుకోవడం విశేషం. శుక్రవారం జబల్పూర్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ తాను ఈ పోటీలో లేనని, అధిష్టానం తనకు కొన్ని ఆదేశాలు జారీ చేసిందని, వాటి ప్రకారమే తాను నడుచుకుంటానని దిగ్విజయ్ స్పష్టం చేశారు.
ఇక ఈ పోటీలో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. గాంధీ కుటుంబం మద్దతు అశోక్ గెహ్లోత్కు ఉన్నట్లు తెలుస్తోంది. వీరే కాకుండా పలువురు నేతలు ఈ పోటీపై ఆసక్తి చూపుతున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్, రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మనీశ్ తివారి, ముకుల్ వాస్నిక్, పృథ్విరాజ్ చౌహాన్లు సైతం పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
24 ఏళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. 1998లో ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టిన అనంతరం నాటి నుంచి ఈ ఎన్నిక జరగలేదు. 2017లో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడు చేసినప్పటికీ.. ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా జరిగిపోయింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియానే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 30 వరకు నామినేషన్లకు గడువు ఇచ్చారు. అనంతరం అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి.