Third Front: మూడో కూటమికి లైన్ క్లియర్..! ఎన్డీయే, ఇండియా కూటములను ఎదుర్కొంటుందా?
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. చాలా కాలంగా వీరిదే ఆధిపత్యం ఉంది. ఏ కూటమి ఏర్పడినా, అందుకు ఎవరు ప్రయత్నాలు చేసినా చివరికి ఈ రెండు పార్టీల చేతుల్లోకి వెళ్తున్నాయి.

2024 Elections: రాబోయే సార్వత్రిక ఎన్నికలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉన్న ఇండియా కూటముల మధ్యే ఉంటుందని ఇప్పటికే అనేక విశ్లేషణలు వస్తున్నప్పటికీ.. వాస్తవానికి పోటీ త్రిముఖం కానున్నట్లు కనిపిస్తోంది. ఈ రెండు కూటములు కాకుండా దేశంలో మూడవ కూటమి ఏర్పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ రెండు కూటముల్లో లేని పార్టీలతో మూడో కూటమి ఏర్పడవచ్చు. అలాగే ఈ రెండు కూటముల్లోని పార్టీలు కూడా మూడవ కూటమిలో చేరే అవకాశం లేకపోలేదని కూడా అనుమానాలు వస్తున్నాయి.
తాజాగా తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకోవడంతో మూడవ కూటమిపై మరిన్ని ఆశలు రేకెత్తాయి. దేశంలో ఇప్పటికే పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఒంటరిగా ఉన్నాయి. ఆ పార్టీలన్నీ కలిస్తే ఎన్డీయే, ఇండియాలకు ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు కానుంది.
రెండు కూటముల్లో లేని ప్రధాన పార్టీలు
బీజేపీ, కాంగ్రెస్ తర్వాత దేశంలో మూడవ అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పినప్పటికీ.. మూడో కూటమి కనుక ఏర్పడితే అందులో చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక తెలంగాణలోని భారత్ రాష్ట్ర సమితి కూడా థర్డ్ ఫ్రంటుకు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరమని కేసీఆర్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అని కూడా ఆయన చెప్తూ వచ్చారు. దీనికి అనుగుణంగా కొత్త కూటమి ఏర్పడనున్న దృష్ట్యా.. ఈ కూటమిలో ఆయన చేరవచ్చు.
ఇక ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ పార్టీ కూడా రెండు కూటముల్లో లేదు. ఆ పార్టీ కూడా మూడవ కూటమిలోకి వచ్చే అవకాశం ఉంది. ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలు అయిన తెలుగు దేశం పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ కూడా రెండు కూటముల్లో లేవు. వీటిలో ఒకటి కానీ రెండు పార్టీలు కానీ మూడో కూటమిలోకి రావొచ్చు. ఇక అలాగే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఏఐఎంఐఎం పార్టీ కూడా మూడవ కూటమిలో చేరే అవకాశం ఉంది. వాస్తవానికి మూడవ కూటమి గురించి ఓవైసీ కొద్ది రోజుల క్రితమే ప్రకటన చేశారు. కేసీఆర్, మాయావతి ఒప్పుకుంటే మూడవ కూటమి సాధ్యమని చెప్పారు.
Rahul Gandhi: రైలులో ప్రయాణించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రయాణికులతో చిట్ చాట్
ఇక వీరితో పాటు ఇండియా కూటమి, ఎన్డీయే నుంచి పలు పార్టీలు బయటికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇండియా కూటమిలోని పార్టీల పట్ల నితీశ్ కుమార్ చాలా నిరాశతో ఉన్నారు. విపక్షాల ఐక్యతకు ఆయన చేసిన ప్రయత్నానికి తగిన గుర్తింపు రాలేదన్న అసంతృప్తి చాలా ఎక్కువగా ఉంది. ఇండియా కూటమి రెండవ సమావేశం అనంతరం కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో అంటీ ముట్టనట్లు ఉన్నారు. దీంతో ఆయన బయటికి వచ్చి మూడవ కూటమిలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చివరి వరకు ఇండియా కూటమిలో ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
పంజాబ్ కు చెందిన శిరోమణి అకాలీ దళ్ కూడా ఏ కూటమిలో లేదు. పైగా ఆ పార్టీ ప్రస్తుతం బీఎస్పీతో పొత్తులో ఉంది. బీఎస్పీ కనుక కూటమిలోకి వస్తే.. అకాలీదళ్ కూడా చేరినట్టే. వీళ్లే కాకుండా మహారాష్ట్రలోని వంచిత్ బహుజన్ అగాఢీ, అస్సాంకు చెందిన ఏఐయూడీఎఫ్, దేశంలోని పలు చిన్న పార్టీలు మూడవ కూటమిలో చేరవచ్చు.
మూడవ కూటమికి కారణాలు
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. చాలా కాలంగా వీరిదే ఆధిపత్యం ఉంది. ఏ కూటమి ఏర్పడినా, అందుకు ఎవరు ప్రయత్నాలు చేసినా చివరికి ఈ రెండు పార్టీల చేతుల్లోకి వెళ్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ రెండు పార్టీల చేతుల్లో కూటములు ఉన్న దృష్ట్యా.. వీరి ప్రమేయం లేకుండా మూడవ కూటమి ఏర్పడొచ్చని అంటున్నారు. ముఖ్యంగా జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని వ్యతిరేకించే పార్టీలో ఈ కూటమి ఏర్పడే అవకాశం ఉంది.
AIADMK BJP: బీజేపీకి షాక్.. ఎన్డీయేతో పొత్తు తెంచుకున్నట్లు అధికారికంగా ప్రకటించిన అన్నాడీఎంకే