హుజూర్ నగర్ ఉప ఎన్నిక బరిలో టీడీపీ

సూర్యా పేట జిల్లా హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఎన్టీ ఆర్ ట్రస్ట్ భవన్ లో శనివారం సెప్టెంబరు 28 న జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నాడు పోటీ చేసే అభ్యర్థిని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…. నల్లగొండ జిల్లాతో టీడీపీకి అవినాభావ సంబంధం ఉందని… కార్యకర్తలు, నాయకుల కోరిక మేరకు ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. పార్టీని వీడిన వారు తెలంగాణలో టీడీపీ బలహీనరపడిందనే విషప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో టీడీపీకి పునర్ వైభవం తేవాలంటే హుజూర్నగర్లో పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారని ఆయన తెలిపారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. తమ అభ్యర్థి సోమవారం నామినేషన్ వేస్తారని రావుల తెలిపారు.
కాగా .. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి, టీఆర్ఎస్ తరుఫున సైది రెడ్డి, బీజేపీ తరుఫున కోట రామారావు పోటీ చేస్తున్నారు. అక్టోబరు 21 న పోలింగ్ జరుగుతుంది. 24న ఫలితాలు వెలువడనున్నాయి.