చంద్రబాబుకి మరో షాక్, కడపలో టీడీపీకి పెద్ద దిక్కు పోయె

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 12:05 PM IST
చంద్రబాబుకి మరో షాక్, కడపలో టీడీపీకి పెద్ద దిక్కు పోయె

Updated On : March 11, 2020 / 12:05 PM IST

ఏపీలో టీడీపీ నుంచి అధికార పార్టీ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకి తమ్ముళ్లు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు కీలక నేతలు, చంద్రబాబు సన్నిహితులు వైసీపీలోకి జంప్ అయ్యారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో జాయిన్ అయ్యారు. బుధవారం(మార్చి 11,2020) సాయంత్రం తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్ లో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ రామసుబ్బారెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డి వెళ్లిపోవడంతో కడప జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.

కొంత కాలంగా టీడీపీ వీడే యోచన:
రామసుబ్బా రెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ నియోకవర్గంలో పలు మార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. టీడీపీని వీడాలని కొంతకాలంగా భావిస్తున్నారు. కార్యకర్తలు, అనుచరులతో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహించారు. పార్టీ మార్పుపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. చివరకు పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా పులివెందుల నియోజవకర్గానికి చెందిన సతీష్ రెడ్డి ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ కుటుంబంపై సుదీర్ఘ కాలం పోరాటం చేసిన సతీష్ రెడ్డి.. టీడీపీని వీడటం సంచలనమైంది. ఈ రాజీనామా మరునాడే రామసుబ్బారెడ్డి సైతం టీడీపీకి రిజైన్ చేసి వైసీపీలో చేరారు. 

స్థానిక ఎన్నికల వేళ వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్:
స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. ఈ రాజీనామాలు టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసింది. నియోజకవర్గాల వారీగా బలమైన నేతల్ని పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను వైసీపీలో జాయిన్ చేసుకుంది. ఇప్పుడు రామసుబ్బారెడ్డి కూడా అధికార పార్టీలోకి వెళ్లారు. రాజకీయ భవిష్యత్తుపై జగన్ భరోసా ఇవ్వడంతో రామసుబ్బారెడ్డి పార్టీ మారినట్టు తెలుస్తోంది. వైసీపీలోకి రామసుబ్బారెడ్డి ఎంట్రీతో జమ్మలమడుగు నియోజకవర్గ రాజకీయం మరో కీలక మలుపు తిరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బలవంతంపు స్నేహంపై రామసుబ్బారెడ్డి అసంతృప్తి:
రామసుబ్బారెడ్డి ఎన్నో ఏళ్లగా టీడీపీలోనే ఉన్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీని వీడతారనే ప్రచారం జోరుగా జరిగింది. ఆయన వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని.. పార్టీ మారడం ఖాయమని ఊహాగానాలు వినిపించాయి. 2019 ఎన్నికలకు ముందు జమ్మలమడుగు టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎప్పటి నుంచో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణరెడ్డి-రామసుబ్బారెడ్డిలు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య కొద్దిరోజులు కోల్డ్ వార్ నడిచింది. రంగంలోకి దిగిన చంద్రబాబు.. ఇద్దరు నేతలతో చర్చలు జరిపి రాజీ చేశారు. జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి.. కడప లోక్‌సభ స్థానం నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేశారు.. కానీ ఇద్దరికీ ఓటమి తప్పలేదు. తర్వాత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు.

జమ్మలమడుగులో టీడీపీ క్లోజ్:
జమ్మలమడుగులో టీడీపీకి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆదినారాయణరెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. రామసుబ్బారెడ్డి కూడా వైసీపీలోకి వెళ్లారు. దీంతో జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. అక్కడ కేడర్‌ను నడిపించే సమర్థవంతమైన మరో నాయకుడిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. ఇలాంటి సమయంలో రామసుబ్బారెడ్డి పార్టీకి రాజీనామా చేయడం టీడీపీకి ఎదురు దెబ్బే అని తమ్ముళ్లు వాపోతున్నారు. అలాగే అభ్యర్థుల ఎంపిక కూడా కత్తిమీద సాములా మారిందంటున్నారు. సుబ్బారెడ్డి గ్రామస్థాయిలో బలమైన నాయకుడు కావడంతో పాటు.. జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో మంచి పలుకుబడి ఉంది. అలాంటి లీడర్ పార్టీని వీడటం టీడీపీకి బిగ్ డ్యామేజ్ జరిగినట్లే అని, కడపలో టీడీపీకి పెద్ద దిక్కు పోయినట్టే అని తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు.

See Also | రేవంత్ రెడ్డికి కోర్టులో ఎదురు దెబ్బ