CM Revanth Reddy : ధరణిపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులపై ఆగ్రహం.. విచారణకు ఆదేశాలు
CM Revanth Reddy : ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు.
CM Revanth Reddy : ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఇక్కడ తెలంగాణ సచివాలయంలో ధరణిపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ధరణి పోర్టల్ నిర్వహణకు సంబంధించి అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : GHMC Deputy Mayor : బీఆర్ఎస్కు గట్టి షాక్.. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి రాజీనామా
ధరణి నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు. ధరణిలో లోపాలు ఉన్నట్టు సంబంధిత కమిటీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో పోర్టల్ నిర్వహణ ఏజెన్సీలపై విచారణకు అధికారులను ఆదేశించారు. 2020లో అమల్లోకి వచ్చిన ఆర్వో ఆర్ చట్టంలోనే లోపాలున్నాయని సీఎంకు ధరణి కమిటీ నివేదించింది.
మార్చి మొదటివారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని వెంటనే పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయని, రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం పేర్కొన్నారు. తుది నివేదిక వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పటివరకు వెంటనే పరిష్కరించాల్సిన సమస్యలపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.