Bhatti Vikramarka Mallu : కావాలనే అలా కూర్చున్నా, నేను ఎవరికీ తలవంచే వాడిని కాదు- ప్రతిపక్షాల ట్రోల్స్‌కు డిప్యూటీ సీఎం భట్టి రిప్లయ్

ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు.. అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Bhatti Vikramarka Mallu : కావాలనే అలా కూర్చున్నా, నేను ఎవరికీ తలవంచే వాడిని కాదు- ప్రతిపక్షాల ట్రోల్స్‌కు డిప్యూటీ సీఎం భట్టి రిప్లయ్

Bhatti Vikramarka Mallu Reaction

Bhatti Vikramarka Mallu : యాదగిరిగుట్టలో కింద కూర్చున్నారు అంటూ జరిగిన ట్రోల్ అంశంపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నాను అని భట్టి తేల్చి చెప్పారు. ఆ ఫోటోను తీసుకొని కావాలని కొందరు ట్రోల్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ”నేను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని శాసిస్తున్నా. ఆర్థికశాఖ నిర్వహిస్తూ రాష్ట్రంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నా.

నేను ఎవరికీ తలవంచే వాడిని కాదు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

అసలేం జరిగిందంటే..
యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పీటలపై కూర్చున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖకు మాత్రం కాస్త ఎత్తు తక్కువ ఉన్న పీటలు వేశారు. ఇది దుమారం రేపింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ వీడియోను షేర్ చేసి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. యాదాద్రీశుడి సాక్షిగా దళిత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఘోర అవమానం జరిగిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. సీఎం రేవంత్ యాదాద్రి పర్యటనలో దళితుడు అనే కారణంతో భట్టిని కింద కూర్చోబెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేశాయి ప్రతిపక్షాలు.

ఈ వ్యవహారం దుమారం రేపడంతో.. దీనిపై భట్టి విక్రమార్క తాజాగా స్పందించారు. ఇందులో ఎలాంటి అవమానం లేదని, కావాలనే తాను చిన్న పీటపై కూర్చున్నానని భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. యాదాద్రి ఆలయం వివాదంపై స్పందించిన ఆయన.. తాను కావాలనే చిన్న స్టూల్ పై కూర్చున్నట్లు స్పష్టత ఇచ్చారు. అంతేకాదు.. నేను రాష్ట్రాన్ని శాసిస్తున్న వ్యక్తి, ఎవరో చెబితే అలా కూర్చునే వాడిని కాదు, ఆత్మగౌరవాన్ని చంపుకోను అని వెల్లడించారు.

యాదాద్రి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ కింద కూర్చోవడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. దళితులు, బలహీన వర్గాలంటే ప్రభుత్వానికి చిన్న చూపా? అని నిలదీశాయి. దేవుడి సాక్షిగా వారికి అవమానం జరిగింది అంటూ విమర్శించాయి. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు స్పందించాయి. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాయి. ఇది కావాలని జరిగిన ఘటన కాదని.. గతంలో రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా భట్టి పైన కూర్చుంటే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కింద కూర్చున్నారని నాటి ఫొటోలను షేర్ చేశాయి.

సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉన్నారు. వారికి అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆ సమయంలో భట్టి విక్రమార్క, కొండా సురేఖ చిన్న స్టూలుపై కూర్చోవడం వివాదానికి దారితీసింది.

Also Read : భట్టి విక్రమార్కకు అవమానం అంటూ బీఆర్ఎస్ మొసలి కన్నీరు : మల్లు రవి కామెంట్స్