Vangaveeti Narendra : వంగవీటి రంగాను హత్య చేసిన పార్టీతో పవన్ పొత్తు ఎందుకు పెట్టుకున్నారు?- వైసీపీలో చేరిన వంగవీటి నరేంద్ర
కాపులు అమాయకులు కాదు.. పవన్ కల్యాణ్ ను నమ్మరు.. రంగా అభిమానిని అని చెప్పుకునే పవన్.. టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు?
Vangaveeti Narendra : వంగవీటి నరేంద్ర వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైపీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్.. వంగవీటి నరేంద్రను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో చేరిక అనంతరం వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. వంగవీటి కుటుంబానికి, వంగవీటి రంగా అభిమానులకు.. టీడీపీ ఎప్పటికీ బద్ద శత్రువే అని వంగవీటి నరేంద్ర అన్నారు. వంగవీటి రంగాను హత్య చేసిన పార్టీ టీడీపీ అని ఆరోపించారు. ఆనాడు అధికారం అడ్డు పెట్టుకుని హత్య కేసును నీరు కార్చారని మండిపడ్డారు.
”వైఎస్ఆర్ కుటుంబానికి వంగవీటి కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి. తమ్ముడు రాధా 2019లో చేసిన తప్పు వల్ల దూరం వచ్చింది. మూడు పార్టీల కూటమి ప్రజల కోసం కాదు.. రాజకీయ స్వార్థం కోసం.. టీడీపీతో జత కట్టడం వల్లే బీజేపీ నుండి బయటకు వచ్చాను. జగన్ పాలన నచ్చి వైసీపీలో చేరాను. కాపులు అమాయకులు కాదు.. పవన్ కల్యాణ్ ను నమ్మరు.. రంగా అభిమానిని అని చెప్పుకునే పవన్.. టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? చంద్రబాబు మేలు కోసం పని చేసే వ్యక్తి పవన్. కాపులకు మేలు చెయ్యడానికి కాదు. విజయవాడ ఈస్ట్ లో వైసీపీ గెలుపు కోసం పని చేస్తా” అని వంగవీటి నరేంద్ర అన్నారు.
Also Read : పిఠాపురంపై వైసీపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్.. పవన్ ఓటమికి సీఎం జగన్ బిగ్ ప్లాన్