ఇదేం కోరికరా బాబూ.. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్కు ముందు మాజీ క్రికెటర్ వింత వ్యాఖ్యలు..
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా నేడు (ఆదివారం ఫిబ్రవరి 15) భారత్, పాకిస్థాన్ (IND vs PAK) జట్లు తలపడనున్నాయి
Ahead Of India vs Pakistan Clash in T20 World cup 2026 Ex Star Makes Bizarre Remark
IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా నేడు (ఆదివారం ఫిబ్రవరి 15) భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే.. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉన్నట్లు శ్రీలంక వాతావరణ శాఖ తెలియజేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని వల్ల ఆదివారం కొలంబోలో 93 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది.
దీంతో క్రికెట్ ప్రేమికులు వర్షం పడొద్దని కోరుకుంటున్నారు. మ్యాచ్ సజావుగా జరగాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ మాత్రం వర్షం పడాలని కోరుకుంటున్నాడు. ఎ స్పోర్ట్స్లో జరిగిన చర్చ సందర్భంగా బాసిత్ అలీ మాట్లాడుతూ దేవుడు వర్షం కురిపించాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. పూర్తి మ్యాచ్ జరగొద్దా అని మరోసారి అడిగినప్పుడు కూడా అతడు ‘నాకు వర్షం కావాలి’ అని పునరుద్ఘాటించాడు.
ప్రస్తుతం అతడు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓడిపోతామనే భయంతోనే వర్షం వచ్చి మ్యాచ్ రద్దు కావాలని అతడు కోరుకుంటున్నాడని భారత అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.
ఫలితం రావాలంటే..
టీ20 మ్యాచ్ల్లో ఫలితం రావాలంటే ఇరు జట్లు కనీసం ఐదేసి ఓవర్ల చొప్పున అయిన ఆడాల్సి ఉంటుంది. లేకపోతే మ్యాచ్ను రద్దు చేస్తారు. టీ20 ప్రపంచకప్ 2026లో వర్షం కారణంగా భారత్, పాక్ మ్యాచ్ రద్దు అయితే.. ఇరు జట్లకు చెరొక పాయింట్ను కేటాయిస్తారు.
ఎందుకంటే ఇది గ్రూప్ దశలో మ్యాచ్ కాబట్టి ఐసీసీ నిబంధనల ప్రకారం ఎలాంటి రిజర్వ్ డే లేదు. ఒకవేళ మ్యాచ్ రద్దు అయి ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తే.. అప్పుడు ఇరు జట్లు తదుపరి దశ సూపర్-8కి అర్హత సాధిస్తాయి.
శనివారం సాయంత్రం కొలంబోలో చిన్నపాటి వర్షం పడింది. ప్రస్తుతం మైదానాన్ని కవర్లలో కప్పి ఉంచారు. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.
