T20 World Cup 2024 : కేఎల్ రాహుల్ కంటే సంజూ శాంసన్ బెటర్.. కుండబద్దలు కొట్టిన అజిత్ అగార్కర్
టీ20 ప్రపంచకప్ 2024కు నెలరోజుల కంటే చాలా తక్కువ సమయమే ఉంది.
T20 World Cup 2024 – KL Rahul : టీ20 ప్రపంచకప్ 2024కు నెలరోజుల కంటే చాలా తక్కువ సమయమే ఉంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే జట్ల వివరాలను ఇప్పటికే ఆయా క్రికెట్ బోర్డులు వెల్లడించాయి. ఇక భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సైతం పొట్టి ప్రపంచకప్లో పాల్గొనే భారత ఆటగాళ్ల వివరాలను వెల్లడించింది. 15 మంది సభ్యుల బృందంతో పాటు నలుగురు ఆటగాళ్లు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక అయ్యారు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ఇండియా బరిలోకి దిగినుంది.
కాగా.. టీ20 ప్రపంచకప్ జట్టులో సీనియర్ ఆటగాడు, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్కు చోటు దక్కలేదు. వన్డే ప్రపంచకప్ 2023లో కేఎల్ రాహుల్ పలు కీలక ఇన్నింగ్స్ లు ఆడాడని, ఐపీఎల్లోనూ రాణిస్తున్న అతడిని టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేస్తే బాగుండేదని పలువురు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు తెలిపారు. అయితే.. కేఎల్ రాహుల్ను ఎందుకు ఎంపిక చేయలేదు అన్న విషయాన్ని ఎట్టకేలకు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు.
మిడిల్ ఆర్డర్లో ఆడే వికెట్ కీపర్ను తీసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే కేఎల్ రాహుల్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయలేదని అగార్కర్ చెప్పారు. కేఎల్ రాహుల్ కంటే తమకు సంజూ శాంసన్ బెస్ట్ ఆప్షన్గా కనిపించాడన్నారు. ఐపీఎల్లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తున్నాడన్నారు. అయితే.. జట్టు అవసరాల దృష్ట్యా మిడిల్ ఆర్డర్లో ఆడే వికెట్ కీపర్ కావాల్సి ఉంది. దీంతోనే రిషబ్ పంత్, సంజూ శాంసన్లను ఎంపిక చేసుకున్నట్లు తెలిపాడు.
అంతేకాకుండా బ్యాటింగ్ లైనప్లో శాంసన్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడని చెప్పారు. ప్లేయర్ ఎవరు అన్నది మేము చూడలేదు. మాకు కావాల్సిన ఆప్షన్స్ను మాత్రమే తీసుకున్నాం అని అజిత్ అగార్కర్ తెలిపాడు. అదే సమయంలో ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేయలేదనే విషయాన్ని స్పష్టం చేశాడు.
CSK : చెన్నై సూపర్ కింగ్స్ కష్టాలు రెట్టింపు? ఒకేసారి ఐదుగురు స్టార్ బౌలర్లు దూరం !
టీ20 ప్రపంచకప్కు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
రిజర్వ్ ప్లేయర్లు.. శుభ్ మన్ గిల్, రింకూసింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ లను ఎంపిక చేశారు.