Asia Cup 2025 : సూపర్ ఓవర్ డ్రామా అదుర్స్.. శ్రీలంక బ్యాటర్ రనౌట్.. కానీ, నాటౌట్ ఇచ్చిన అంపైర్.. ఎందుకంటే..? వీడియో వైరల్..
Asia Cup 2025 IND vs SL super over : ఆసియా కప్ 2025 సూపర్ -4లో శుక్రవారం రాత్రి భారత్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.

Asia Cup 2025 IND vs SL Super Over
Asia Cup 2025 IND vs SL super over : ఆసియా కప్ 2025 సూపర్ -4లో శుక్రవారం రాత్రి భారత్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ ఓవర్లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. అయితే, ఈ సూపర్ ఓవర్లో అసలైన డ్రామా చోటు చేసుకుంది.
సూపర్ ఓవర్లో తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేసింది. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్ చేశాడు. అయితే, అర్ష్దీప్ వేసిన తొలి బంతికే కుశాల్ పెరార క్యాచ్ ఔట్ అయ్యాడు. రెండో బంతికి మెండిస్ సింగిల్ తీశాడు. మూడో బంతికి శనక పరుగులు చేయలేదు.నాల్గో బంతిని అర్ష్దీప్ వైడ్ వేశాడు. మరోసారి నాలుగో బంతికి శనక రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బ్యాట్ను తాకకుండా వికెట్ కీపర్ చేతిలోకి బంతి వెళ్లింది. రనౌట్ కోసం అప్పీలు చేసినప్పటికీ.. సమీక్షలో కీపర్ అండర్ ఆర్మ్తో బంతిని విసిరినట్లు తేలింది. దీంతో శనక నాటౌట్గా కొనసాగాడు. కానీ, ఐదో బంతికే భారీ షాట్కు యత్నించి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి కేవలం రెండు పరుగులు మాత్రమే చేసింది.మూడు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా.. మొదటి బంతికే విజయం సాధించింది. హసరంగ వేసిన తొలి బంతిని సూర్యకుమార్ యాదవ్ ఆడాడు. మూడు పరుగులు తీశాడు. దాంతో లంకపై భారత్ విజయం సాధించింది.
View this post on Instagram
ఈ మ్యాచ్లోతొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో భారీ స్కోర్ చేసింది. 5 వికెట్ల నష్టానికి 202 రన్స్ చేసింది. అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిడిలార్డర్లో తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), సంజు సామ్సన్ (23 బంతుల్లో 39; 1 ఫోర్, 3 సిక్స్లు)కూడా కీలక పరుగులు సాధించడంతో భారత జట్టు భారీ స్కోర్ చేయగలిగింది. 203 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన శ్రీలంక జట్టులో పతుమ్ నిసాంక (58 బంతుల్లో 107; 7 ఫోర్లు, 6 సిక్స్లు) అద్భుత సెంచరీతో సత్తా చాటగా, కుషాల్ పెరీరా (32 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఫలితంగా శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్లో భారత్ విక్టరీ కొట్టింది.