Suryakumar Yadav : పాక్ ఇజ్జత్ తీసిన సూర్యకుమార్ యాదవ్.. గణాంకాలు చూసైనా.. ప్రత్యర్థి అనకండి ప్లీజ్..
పాకిస్తాన్ ఇజ్జత్ను టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav ) పరోక్షంగా తీశాడు.

Asia cup 2025 India vs Pakistan is not a rivalry anymore says Suryakumar Yadav
Suryakumar Yadav : క్రికెట్ ప్రపంచంలో భారత్, పాక్ మధ్య పోరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరు దేశాల అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే.. గత కొన్నాళ్లుగా ఈ మ్యాచ్లు సప్పగా సాగుతున్నాయి. దాదాపుగా ఏక పక్ష విజయాలనే భారత్ అందుకుంటోంది. కనీసం పాక్ కాస్త కూడా పోటీ ఇవ్వడం లేదు.
ఇక ఆసియాకప్ 2025లోనూ రెండు సార్లు భారత్ చేతిలో పాక్ ఓడిపోయింది. గత ఆరు మ్యాచ్లను తీసుకున్నా కూడా ఒక్కటంటే ఒక్క మ్యాచ్లోనూ పాక్ విజయం సాధించలేదు. ఈ క్రమంలో సూపర్ 4లో భాగంగా దుబాయ్లో పాక్ పై విజయం సాధించిన అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో పరోక్షంగా పాక్ ఇజ్జత్ మొత్తం తీసేశాడు.
వాళ్లను ప్రత్యర్థులు అని ఎలా పిలుస్తారు ?
రెండు జట్ల మధ్య ఉన్న చారిత్రాత్మక పోటీ గురించి సూర్యకు ప్రశ్న ఎదురుకాగా.. పోటీ ఏకపక్షంగా మారిందన్నాడు. ఇంకెప్పుడూ కూడా పాక్ ను తమకు ప్రత్యర్థిగా అనొద్దని ఇన్డైరెక్టుగా సూర్య తెలిపాడు.
ఇక నుంచైనా మీరు ప్రత్యర్థి అనే పదం వాడొద్దు. ఏ జట్టు అయినా కూడా నాణ్యమైన క్రికెట్ ఆడుతుందా? లేదా ? అనేదేనే తనకు ముఖ్యం అని సూర్య చెప్పాడు. ఓ రెండు జట్ల మధ్య 20 మ్యాచ్లు జరిగాయని అనుకుందాం. అప్పుడు 10-10, 11-9, 12-8 గణాంకాలు నమోదైతే వాటిని ప్రత్యర్థులు (సమవుజ్జీల మధ్య జరిగే పోటీ) భావించవచ్చునని చెప్పాడు. అంతేగానీ.. 13-0, 10-1 గణాంకాలు నమోదైతే అక్కడ పోటీ ఎక్కడ ఉంటుంది. వాళ్లను ప్రత్యర్థులు అని ఎలా పిలుస్తారు అని అన్నాడు.
ఇక గ్రౌండ్లు ఎందుకు పూర్తిగా నిండుతున్నాయనే ప్రశ్న ఎదురుకాగా.. తాము అభిమానులను ఎంటర్టైన్ చేయడానికే వచ్చామనే విషయాన్ని తాము ఇంతకముందే చెప్పినట్లుగా సూర్య గుర్తు చేశాడు. పాక్ కంటే నాణ్యమైన క్రికెట్ ఆడడంతోనే తాము విజయం సాధించామన్నాడు. గత వారం ఇక్కడ ఆడిన పిచ్తో పోలిస్తే ఈ సారి కొంచెం మెరుగ్గా ఉందన్నాడు. బ్యాటింగ్ చేయడానికి చాలా బాగుందన్నాడు. ఇక మ్యాచ్లో ఏ జట్టు అయితే.. ఏడు నుంచి 15 ఓవర్ల మధ్య మెరుగైన ప్రదర్శన చేస్తుందో ఆ జట్టే గెలుస్తుందన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సాహిబ్జాదా ఫర్హాన్ (58; 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది. టీమ్ఇండియా బౌలర్లలో శివమ్ దూబె రెండు, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ లు చెరో వికెట్ తీశారు.
లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (74; 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (47; 28 బంతుల్లో 8 ఫోర్లు), తిలక్ శర్మ (30; 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టారు. పాక్ బౌలర్లలో హారిస్ రౌఫ్ రెండు వికెట్లు తీశాడు. అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్ లు తలా ఓ వికెట్ పడగొట్టాడు.