USA v BAN : టీ20 ప్రపంచకప్కు ముందు బంగ్లాదేశ్ పరువు పాయె..! సవాల్ విసురుతున్న అమెరికా
టీ20 క్రికెట్లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో చెప్పడం కష్టం.
టీ20 క్రికెట్లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో చెప్పడం కష్టం. పొట్టి ఫార్మాట్ అనిశ్చితికి మారుపేరు అని ఇప్పటికి కూడా చాలా మంది చెబుతూ ఉంటారు. వారి అంచనాలను నిజం చేస్తూ పెద్ద జట్లకు షాకులు ఇస్తున్నాయి చిన్న జట్ల. మొన్న పాకిస్తాన్కు ఐర్లాండ్ గట్టి షాక్ ఇవ్వగా నేడు బంగ్లాదేశ్కు అమెరికా చుక్కలు చూపించింది. ఏకంగా టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్లో చిన్న జట్లే కదా అని తేలికగా తీసుకుంటే మాత్రం ఘోర పరాభవాలు ఎదురవడం ఖాయం.
పొట్టి ప్రపంచకప్లో రాణించేందుకు దాదాపు ఓ నెల ముందుగానే యూఎస్కు వెళ్లింది బంగ్లాదేశ్. అమెరికా జట్టుతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతోంది. మొదటి టీ20 మ్యాచులో ఐదు వికెట్ల తేడాతో బంగ్లా ఓడిపోయింది. ఏదో అలా జరిగిపోయింది.. అయినప్పటికీ కూడా బలమైన బంగ్లాదేశ్ మిగిలిన మ్యాచుల్లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంటుందని ఆ జట్టు అభిమానులు భావించారు.
సన్రైజర్స్ హైదరాబాద్ Vs రాజస్థాన్ రాయల్స్.. ఐపీఎల్ 2024లో మరో హైవోల్టేజ్ మ్యాచ్?
కాగా.. గురువారం జరిగిన రెండో టీ20 మ్యాచులోనూ బంగ్లాదేశ్ 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే అమెరికా టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో అమెరికా మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. అమెరికా బ్యాటర్లలో కెప్టెన్ మొనాక్ పటేల్(42), ఆరోన్ జోన్స్ (35), స్టీవెన్ టేలర్(31) లు రాణించారు. బంగ్లా బౌలర్లో ముస్తాఫిజుర్ రహ్మన్, రిషాద్ హోస్సైన్, షోరిఫుల్ ఇస్లామ్ లు తలా రెండు వికెట్లు తీశారు.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ తడబడింది. 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ షాంటో 36 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. షకీబ్ అల్ హసన్ (30), తౌహీద్ హృదయ్ (25) లు రాణించినప్పటికీ ఓటమి తప్పలేదు.
MS Dhoni : ఫేస్బుక్లో ధోని పోస్ట్ వైరల్.. ‘సమయం ఆసన్నమైంది..’ రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చాడా?
చరిత్ర సృష్టించిన అమెరికా..
ఐసీసీ అసోసియేట్ దేశమైన అమెరికా.. టెస్టు హోదా ఉన్న దేశంపై టీ20 సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి. బంగ్లాదేశ్ పై మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలిచి అమెరికా చరిత్ర సృష్టించింది. ఇక జట్ల మధ్య నామమాత్రమైన మూడో టీ20 మే25న జరగనుంది.