Harry Brook : పిచ్ మారిపోయింది.. అందుకే ఇండియా గెలిచింది.. ఓటమి పై ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సంచలన వ్యాఖ్యలు..
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) స్పందించాడు.
Harry Brook Comments viral after England lost match lo india in 1st odi
- తొలి వన్డేలో ఓడిన ఇంగ్లాండ్
- ఓటమి పై స్పందించిన కెప్టెన్ హ్యారీ బ్రూక్
Harry Brook : టీ20 సిరీస్ను వైట్ వాష్ చేసిన ఇంగ్లాండ్.. వన్డే సిరీస్ ఆరంభ మ్యాచ్లో తడబడింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. బ్యాటింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తెలిపాడు. మిడిల్ ఓవర్లలో 20 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడం బాగా దెబ్బతీసిందని అన్నాడు.
జోరూట్ (76 నాటౌట్; 76 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), లియామ్ డాసన్ (68; 83 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబెలు తలా ఓ వికెట్ సాధించారు.
ఆ తరువాత 259 పరుగుల లక్ష్యాన్ని భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుభ్మన్ గిల్ (80 రిటైర్డ్ హర్ట్; 75 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (53 నాటౌట్; 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్; 63 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. శ్రేయస్ అయ్యర్ (35) రాణించాడు. ఇంగ్లాడ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, సామ్ కరన్లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
IND vs ENG : తొలి వన్డేలో ఘోరంగా విఫలమైన రో-కో.. గంభీర్కు ఛాన్స్ ఇస్తున్నారుగా?
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్పందించాడు. నిజం చెప్పాలంటే ఇది తాము ఆశించిన ఫలితం కాదన్నాడు. మధ్య ఓవర్లలో 20 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడిలో పడిపోయామన్నాడు. ఇదే తమ ఓటమిని శాసించిందన్నాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా ఆటగాళ్లు పుంజుకుని పోరాడే స్కోరును అందించడం బాగుందన్నాడు. జోరూట్, లియామ్ డాసన్ నెలకొల్పిన భాగస్వామ్యం ఎంతో కీలకమన్నాడు. తమ బ్యాటింగ్ ఇంకా మెరుగుకావాల్సి ఉందన్నాడు. 20 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడం ఏ మాత్రం సమంజసం కాదన్నాడు.
పిచ్ మారింది..
తొలి ఇన్నింగ్స్తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్లో పిచ్ మారిపోయిందన్నాడు. తొలి ఇన్నింగ్స్లో తరహాలోనే స్పందించి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. బ్యాటర్లు ఈజీగా పరుగులు చేసేలా మారిందన్నాడు. ఓవర్కు 5 నుంచి 6 పరుగులే చేయాల్సి ఉండడంతో ప్రత్యర్థి బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడి పరుగులు సాధించారన్నాడు.
ఇక తాము ఎప్పుడూ కూడా పిచ్ పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేస్తామన్నాడు. బ్యాటర్లు ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే తమ స్పిన్నర్లు ప్రత్యర్థిని కట్టడి చేసి ఉండేవారని అభిప్రాయపడ్డాడు. ఇక రెండో వన్డేలో జట్టు కాంబినేషన్ గురించి ఇంకా ఆలోచించలేదన్నాడు. ఆ మ్యాచ్కు వేదిక అయిన కార్డిఫ్ కు వెళ్లిన తరువాత అక్కడి పిచ్ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నాడు.
