IND vs AUS 4th T20 : సిరీస్ మనదే.. నాలుగో టీ20లో భారత్ విజయం.. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే..
India vs Australia 4th T20 : మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు టీ20 సిరీస్ను సొంతం చేసుకుంది.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు టీ20 సిరీస్ను సొంతం చేసుకుంది. రాయ్పుర్ లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచులో 20 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో భారత్ 3-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. నామమాత్రమైన చివరి టీ20 మ్యాచ్ ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లో ఏడు వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బ్యాటర్లో మాథ్యూ వేడ్ (36 నాటౌట్; 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ట్రావిస్ హెడ్ (31; 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), లు రాణించారు. మిగిలిన వారు విఫలం కావడంతో ఆసీస్కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. దీపర్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవిబిష్ణోయ్, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ సాధించారు.
Pakistan Cricket Team : ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ ఆటగాళ్లకు ఘోర అవమానం..! వీడియో
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రింకూ సింగ్ (46; 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (37; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్), జితేశ్ శర్మ (35; 19 బంతుల్లో 1 ఫోర్, 3సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (32; 28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డ్వారిషుస్ మూడు వికెట్లు తీశాడు. తన్వీర్ సంఘ, జాసన్ బెహ్రెండోర్ఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆరోన్ హార్డీ ఓ వికెట్ సాధించాడు.